
సీనియర్ నటి రమాప్రభ సినీ ప్రస్థానం ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, తెలియని నిజాలతో నిండి ఉంది. ఆమె అద్భుత జ్ఞాపకశక్తి, నిబద్ధత, అంకితభావం తెలుగు, తమిళ సినీ రంగాలలో ఆమెకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి.
రమాప్రభ అసలు పేరు రమాదేవి. ఆమె 1948 అక్టోబర్ 5న అనంతపురం జిల్లాలోని కదిరిలో కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు జన్మించారు. నెలల పసికందుగా ఉన్నప్పుడే మేనత్త రాజమ్మ, మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ దంపతులకు దత్తత వెళ్లారు. కృష్ణదాస్ ముఖర్జీ బెంగాలీ కావడంతో ఆమె బాల్యం కదిరి, ఊటీలలో గడిచింది. చదువు పెద్దగా అబ్బకపోయినా, 14 ఏళ్ల వయసులో మద్రాస్ చేరుకున్న తర్వాత నాటకరంగం పట్ల ఆకర్షితులయ్యారు. ఆర్.ఎస్. మనోహర్ నాటక కంపెనీలో చేరి, తమిళ నాటకరంగంలో లబ్ధప్రతిష్ఠురాలిగా ఎదిగారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా విని ఇట్టే చెప్పేసే ఏకసంథాగ్రాహిగా ఆమె పేరు పొందారు. తమిళంలో దాదాపు 30 చిత్రాలలో నటించిన తర్వాత, ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు.
దర్శకుడు ప్రత్యగాత్మ చిలకా గోరింక చిత్రంలో కృష్ణంరాజును హీరోగా పరిచయం చేశారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన రమాప్రభను లీడ్ రోల్ కోసం ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్లో పద్మనాభం సీన్ పేపర్ ఇచ్చి డైలాగులు చదువుకోమని చెప్పగా, తనకు తెలుగు చదవడం రాదని రమాప్రభ భయంగా చెప్పారు. దీనికి ఆశ్చర్యపోయిన ప్రత్యగాత్మ, పద్మనాభం ఆమెను పరిశీలించారు. అయితే, పద్మనాభం డైలాగులు చదవగానే, రమాప్రభ తడుముకోకుండా తన డైలాగులు చెప్పి, సింగిల్ టేక్లో షాట్ ఓకే చేయించుకున్నారు. ఈ సంఘటన ఆమె అద్భుత జ్ఞాపకశక్తికి, అభినయ సామర్థ్యానికి నిదర్శనం. ఆమె సెల్వం, పట్టణత్తిల్ భూతం వంటి తమిళ చిత్రాల్లో, నిండు మనసులు, అడుగు జాడలు, డాక్టర్ ఆనంద్ వంటి తెలుగు చిత్రాల్లో, కన్నడ చిత్రం కన్యకా పరమేశ్వరిలో, హిందీ చిత్రం జై జవాన్ జై కిసాన్లో కూడా నటించారు. హాస్య పాత్రలకే పరిమితమైనప్పటికీ, 1400కు పైగా చిత్రాల్లో నటించి, వాణిశ్రీ లాంటి స్టార్ స్టేటస్ను పొందారు.
రమాప్రభ కెరీర్లో హాస్య నటుడు రాజబాబుతో ఆమె జోడి ఓ సంచలనం. వందకు పైగా చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. వీరిద్దరూ సినిమాలో ఉన్నారని తెలిస్తే చాలు, టిక్కెట్లు తెగేవి. రాజబాబు, రమాప్రభల జంటకు ఎంత డిమాండ్ ఉండేదంటే, కథ సిద్ధమయ్యాక హీరో ఎవరన్నది ఖరారు కాకముందే నిర్మాతలు వీరిద్దరి డేట్స్ను బ్లాక్ చేసుకునేవారు. పొద్దున ఒక షూటింగ్, మధ్యాహ్నం మరొక షూటింగ్, రాత్రి ఇంకొక షూటింగ్ ఇలా రోజుకు 20 గంటల పాటు పని చేసిన రోజులు వారికి చాలా ఉన్నాయి. రాజబాబు మరణం తన జీవితంలో అతిపెద్ద నష్టమని రమాప్రభ పేర్కొన్నారు.
వ్యక్తిగత జీవితం, ఇతర వివరాలు:
రమాప్రభ తన అక్క కూతురు విజయ చాముండేశ్వరిని నటుడు రాజేంద్రప్రసాద్కు ఇచ్చి వివాహం చేసి బంధుత్వం కలుపుకున్నారు. శరత్ బాబుతో ఆమె వివాహం, ఆ తర్వాత విడిపోవడం ఆమెకు రెండవ పెద్ద లోటు. ఆర్థికంగానూ ఆమె పలు ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. రమాప్రభ నిర్మాతగా కూడా గాంధీనగర్ రెండవ వీధి, అప్పుల అప్పారావు, వింత ఇల్లు సంతగోల వంటి చిత్రాలను నిర్మించారు. అయ్యప్పమాల ధరించిన తొలి తెలుగు నటి రమాప్రభే కావడం విశేషం. అవకాశాలు తగ్గిన ఒక దశలో ఆమె భక్తిమార్గం పట్టినప్పటికీ, దర్శకుడు కృష్ణవంశీ ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంతో మళ్లీ ఆమెకు పునర్వైభవం కల్పించారు. ప్రస్తుతం ఆమె చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సమీపంలోని వాయల్పాడులో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమెకు ఖర్చుల నిమిత్తం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొంత మొత్తాన్ని పంపుతున్నట్లు ఆమె ఓ సందర్భంలో వివరించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి