
కళాభినేత్రి వాణిశ్రీ వివాహం 1979 ఫిబ్రవరి 28న చెన్నైలోని వడపళనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించడం విశేషం. నర్తనశాల చిత్ర నిర్మాత లక్ష్మీరాజ్యం, ప్రముఖ నటి షావుకారు జానకి స్వయంగా వాణిశ్రీని పెళ్లి కూతురిని చేసి వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. వారిని అనుసరిస్తూ జయసుధ, రమాప్రభ, గీతాంజలి వంటి తారలు కూడా పెళ్లిలో సందడి చేశారు. రాత్రి 11 గంటల 52 నిమిషాలకు డాక్టర్ కరుణాకరన్, వాణిశ్రీ మెడలో తాళి కట్టారు. ఆ రోజు మంచి ముహూర్తాలు అంతగా లేకపోవడంతో, హడావిడిగా ఈ పెళ్లి జరిపించారని తెలుస్తోంది. ఉదయమే వాణిశ్రీ ఇంటికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించారు ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు. అయితే, ఈ వేడుకకు అప్పటికే రెండు చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ వివాహానికి సినీ లోకంలోని ప్రముఖులందరూ తరలివచ్చినా, ఎన్టీఆర్ గైర్హాజరు ఆ రోజు చర్చనీయాంశంగా మారింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘కళాభినేత్రి’, ‘నవలానాయిక’గా ప్రసిద్ధి చెందిన వాణిశ్రీ, 1960, 70ల దశకాల్లో అగ్ర కథానాయకులకు సమానంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఏకైక నటి. ఆమె అసలు పేరు రత్నకుమారి. నెల్లూరులో జన్మించిన ఆమె తన అద్భుత నటనతో, విలక్షణమైన శైలితో టాలీవుడ్ను ఒక ఊపు ఊపారు. ఆ కాలంలో అగ్ర హీరోలతో సమానంగా, కొన్నిసార్లు వారి కంటే కూడా ఎక్కువ పారితోషికం (రెమ్యునరేషన్) అందుకున్న రికార్డు వాణిశ్రీ సొంతం. అప్పట్లో మహిళా ప్రేక్షకులకు వాణిశ్రీనే పెద్ద ఫ్యాషన్ ఐకాన్. చీర కట్టు విధానం, పెద్ద బొట్టు పెట్టుకోవడం, మ్యాచింగ్ లిప్స్టిక్, నెయిల్ పాలిష్ వాడటం, రకరకాల హెయిర్ స్టైల్స్ (కొప్పులు) పరిచయం చేసింది ఆమెనే.
1979లో డాక్టర్ కరుణాకరన్ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఆ తర్వాత 1989లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ చిత్రంలో అహంకారంగల అత్త పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ఆ పాత్రకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.