
టాలీవుడ్ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తనకున్న అనుబంధాన్ని, అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను ఆసక్తికరంగా వివరించారు. రామ్ గోపాల్ వర్మను భూగోళం మీద ఒక ప్రత్యేకమైన జాతికి చెందిన జీవిగా తనికెళ్ళ భరణి అభివర్ణించారు. ‘శివ’ సినిమాకు ముందు వర్మను చూసినప్పుడు, ఆయనలో అంత గొప్ప దర్శకుడు ఉన్నాడని తాను ఊహించలేదని భరణి నిజాయితీగా చెప్పారు. వర్మకు ఇంగ్లీష్ సాహిత్యంపై ఉన్న పట్టు, ఎప్పుడూ కామిక్స్ చదువుతూ ఉండే ఆయన అలవాటు గురించి ప్రస్తావించారు. వర్మకు వ్యక్తులను మర్చిపోయే లక్షణం ఉందని, అది ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగమని భరణి స్పష్టం చేశారు. “మీరు గొప్ప రచయితవని కాదు, మీ కంపెనీ బాగుంటుందని మిమ్మల్ని పెట్టుకుంటున్నాను” అని వర్మ తనతో ముక్కుసూటిగా అన్న మాటలను భరణి గుర్తు చేసుకున్నారు.
వర్మ తనను పిలిచి ‘శివ’ కథను రెండున్నర గంటల పాటు వివరించి, మాటలు రాయమని కోరారని భరణి తెలిపారు. వర్మ పలకరింపులో ఉండే విచిత్రమైన మేనరిజం(ఏకవచనంతో పిలిచి, గౌరవంగా సంబోధించడం) గురించి ఆయన వివరించారు. వర్మ తన తెలివితేటలతో తనను ఆకట్టుకున్నారని, తామిద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఏర్పడిందని చెప్పారు. మరోవైపు తనికెళ్ళ భరణి తన బాల్యం రైల్వే క్వార్టర్స్, బస్తీ వాతావరణంలో గడిచిందని తెలిపారు. దొంగతనాలు చేసేవారితో కలిసి తిరిగినప్పటికీ, ఆ పరిస్థితులు తనను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు. సినిమాల కోసం కాగితాలు, పాత సామాన్లు అమ్మడం, తండ్రి జేబులో నుంచి డబ్బులు తీసుకోవడానికి వేసే ప్రణాళికలు లాంటి సరదా ముచ్చట్లను పంచుకున్నారు. ఈ అనుభవాలే చదువురాని వారిలో కూడా లోకజ్ఞానం, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని తాను నమ్మడానికి కారణమని భరణి పేర్కొన్నారు.
ఇది చదవండి: రిలీజ్కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..