
పహిల్వాన్ నెల్లూరు కాంతారావు, కుస్తీ పోటీలలో అపారమైన కీర్తిని సంపాదించి, ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. 1931 జనవరి 24న నెల్లూరులో జన్మించిన ఈయన, నెల్లూరులోని వి.ఆర్. కాలేజీలో ఇంటర్ వరకు విద్యనభ్యసించారు. చిన్నతనం నుంచే కుస్తీ పోటీల పట్ల ఎంతో మక్కువ చూపిన కాంతారావు, కఠోర వ్యాయామం చేసి, అరివీర భయంకరులైన అనేక మంది ఉస్తాదులను ఓడించి పేరు ప్రఖ్యాతులు పొందారు. ముఖ్యంగా, 1948 నుంచి 1956 వరకు ఆయన అనేక కుస్తీ పోటీలలో అజేయంగా నిలిచారు. 1955లో నెల్లూరులో జాతీయ స్థాయి కుస్తీ పోటీలను స్వయంగా నిర్వహించారు. ఈ పోటీలకు వి.ఆర్. కాలేజీ గ్రౌండ్స్ వేదికగా నిలిచింది. ఇక్కడ కింగ్ కాంగ్, దారా సింగ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధులను నెల్లూరు ప్రజలకు పరిచయం చేసే అవకాశం కల్పించారు. 1956లో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో అప్పటి మల్లయోధుడు నూకరాజును ఓడించి ఆంధ్రా టైగర్ బిరుదును అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన మల్లయోధుడుగా దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1952 ఇండియా ఒలంపిక్ గేమ్స్కు ఉమ్మడి మద్రాసు ప్రతినిధిగా, 1956 పోలాండ్ లో జరిగిన వరల్డ్ యూత్ ఫెస్టివల్లో భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. సన్నిహితులు ఆయనను ఆప్యాయంగా కాంతం అని పిలిచేవారు.
కుస్తీ రంగంలోనే కాకుండా, రాజకీయాల్లోనూ కాంతారావు క్రియాశీలంగా వ్యవహరించారు. వామపక్ష భావజాలం కలిగిన ఆయన, కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. కొంతకాలం నెల్లూరు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. సామాజిక సేవలో భాగంగా, 1951లో తన సోదరులతో కలిసి నెల్లూరులో కనకమహల్ థియేటర్ను నిర్మించారు. ఈ థియేటర్ వెనుక భాగంలో స్థానిక యువతకు వ్యాయామం, కుస్తీ సాధన కోసం ఒక వ్యాయామశాల, కుస్తీ గరిడీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ థియేటర్ లేనప్పటికీ, ఆ ప్రాంతం కనకమహల్ సెంటర్ గా ప్రసిద్ధి చెందింది. కనకమహల్ థియేటర్ లో అవే కళ్ళు చిత్రం విడుదల సమయంలో వి.ఆర్. కాలేజీ విద్యార్థులతో జరిగిన ఒక సంఘటన ఆయన జీవితంలో ఒక చర్చనీయాంశంగా మిగిలింది. 1959లో ఎన్టీఆర్ నటించిన రేచుక్క-పగటిచుక్క చిత్రంతో నెల్లూరు కాంతారావు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. 1965లో నర్తనశాల చిత్రంలో మల్లయుద్ధ యోధుడు జీమూతమల్లు పాత్రలో దండమూడి రాజగోపాల్ తో కలిసి చేసిన మల్లయుద్ధం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఏడాది వచ్చిన వీరాభిమన్యు చిత్రంలో ఘటోత్కచుడిగా ఆయన పోషించిన పాత్ర, ముఖ్యంగా అందులో చిత్రీకరించిన ట్రిక్ షాట్స్, ఆయనకు ఎంతో పేరు తెచ్చాయి.
నటనకు మాత్రమే పరిమితం కాకుండా, నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. హాస్యనటుడు నగేష్ హీరోగా నటించిన తమిళ చిత్రాన్ని సర్వర్ సుందరం పేరుతో తెలుగులోకి అనువదించారు. టైగర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కాంతారావు నిర్మించిన తొలి స్ట్రెయిట్ చిత్రం అసాధ్యుడు. వీరాభిమన్యు చిత్రంలో నటిస్తున్న సమయంలో నిర్మాత డూండీతో ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా, డూండీ నిర్మిస్తున్న గూఢచారి 116 యూనిట్నే ఉపయోగించుకుని కృష్ణ హీరోగా అసాధ్యుడు చిత్రాన్ని రూపొందించారు. వి. రామచంద్రరావు ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. 1968 సంక్రాంతికి ఎన్టీఆర్ ఉమా చండీ గౌరీశంకర కథ చిత్రంతో పోటీగా అసాధ్యుడును విడుదల చేసి, విజయవంతం అయ్యారు. ఎన్టీఆర్ సినిమా ఫ్లాప్ అవగా, అసాధ్యుడు విజయం సాధించింది. అయితే, కృష్ణతో నిర్మించిన తదుపరి చిత్రం అఖండుడు ఫ్లాప్ కావడంతో, ఆ తర్వాత నిర్మాణం జోలికి వెళ్లకుండా నటనకే పరిమితమయ్యారు. నేనంటే నేనే, రౌడీ రాణి, అల్లుడే మేనల్లుడు, అంతస్తులు, ఇద్దరు మొనగాళ్లు, కంచుకోట, బొబ్బిలి యుద్ధం వంటి అనేక చిత్రాలలో నటించారు. కాంతారావు అందరితో స్నేహంగా ఉంటూ, ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జీవించారు. దురదృష్టవశాత్తు, 1970 డిసెంబర్ 8న నూజివీడు ఆస్పత్రిలో ఒక ఆపరేషన్ వికటించడంతో ఆయన కన్నుమూశారు.
Also Read: ‘ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు’.. సునీల్పై హీరో ఆకాష్ సంచలన ఆరోపణలు