
లెజెండరి సింగర్ ఆశా భోంస్లే కన్నుమూశారు. శనివారం (ఏప్రిల్ 11) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె ఆదివారం (ఏప్రిల్ 12) తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆశా భోంస్లేకు నివాళి అర్పిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి తదితర సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ఆశా భోంస్లే మరణంతో సంగీతాభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆమె పాడిన పాటలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. కాగా ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ సొంత అక్కాచెల్లెళ్లు అన్న విషయం అందరికీ తెలిసిందే. లెజెండరీ సింగర్స్ గా భారతీయ సంగీత ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేశారు. అయితే ఈ సింగర్ల మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారంలో ఉంది. ముఖ్యంగా లతా మంగేష్కర్ చాలా రోజుల పాటు ఆశాను దూరం పెట్టారన్న రూమర్లు ఉన్నాయి. ఒక కుటుంబంలో రెండు గాన కోకిలలు గొంతెత్తి పాటలు పాడుతుంటే సంబరపడిపోయిన సంగీతాభిమానులు వారి మధ్య మనస్పర్థలు వచ్చాయని తెలిసి ఆశ్చర్యపోయారు.
లతా మంగేష్కర్, ఆశా.. ఇద్దరూ ఒకే రంగంలో ఉండేవారు. లతా మంగేస్కర్ ఎక్కువగా స్టార్ హీరోయిన్లకు పాటలు పాడితే.., ఆశా భోస్లే భిన్నమైన, వెరైటీ పాటలతో గుర్తింపు పొందారు. ఈ క్రమంలో కొంతమంది సంగీత దర్శకులు వీరిద్దరిలో ఒక్కరికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా ఇద్దరి మధ్య సమస్యలు వచ్చాయని ప్రచారంలో ఉంది. ఇక ఆశా భోంస్లే చిన్న వయసులోనే తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడంతో లతా మంగేష్కర్ ఆమెను దూరం పెట్టారన్న కథనాలు కూడా వచ్చాయి. అయితే ఈ గొడవలు కొంత కాలమే ఉన్నాయని, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారని వీరి సన్నిహితులు చెబుతారు.
1984లో ‘ఉత్సవ్’ సినిమాలో ‘మన్ క్యోం బెహ్కా రీ బెహ్కా…’ పాట తరువాత లత, ఆశా కలసి పాడ లేదు. కానీ, సుమారు పన్నేండేళ్ల క్రితం లతా మంగేష్కర్ సొంత సంగీత సంస్థ ‘ఎల్.ఎం. మ్యూజిక్’లో ఆశా భోంస్లే ఒక పాటను పాడారు. ఆ సమయంలో తన సోదరి గురించి లతా మంగేష్కర్ ఇలా చెప్పుకొచ్చారు. ‘మా చెల్లెలు బహుముఖ ప్రతిభ ఉన్న గాయని. ఆమెతో కలసి చాలా పాటలు పాడాను. ఆమెతో కలసి పాడడం ఎప్పుడూ ఓ సవాలే. మళ్లీ మా చెల్లెలితో ఇలా కలవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
Asha Bhosle ji’s voice has been a timeless companion to Indian cinema, carrying a spectrum of emotions across generations. I have always admired the effortless grace and versatility she brought to every song.
Indian cinema has lost one of its most irreplaceable voices. My… pic.twitter.com/3zpUS7MqNj
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 12, 2026
కాగా లతా మంగేష్కర్ 2022లో కోవిడ్-19, న్యుమోనియా సమస్యలతో కన్నుమూశారు. ఇప్పుడు ఆశా భోంస్లే కన్నుమూసిన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే లతా మంగేష్కర్ కూడా తుది శ్వాస విడిచారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.