
టాలీవుడ్ నటుడు రవి వర్మ అడ్డూరి వెండితెరపైకి హీరోగా ‘ఆరుగురు పతివ్రతలు’ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఇక ఆ సినిమా రీ-రిలీజ్ అంశంపై ఇప్పటికీ నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. తనకు కూడా సోషల్ మీడియా వేదికగా ఆ మూవీను రీ-రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారని తెలిపాడు. దీంతో ఈ అంశంపై రవి వర్మ హీరో అల్లరి నరేష్తో మాట్లాడారట. అయితే, నరేష్ ప్రస్తుతానికి రీ-రిలీజ్ వాయిదా వేయాలని, నాన్న(ఈవీవీ సత్యనారాయణ) ఉన్నప్పుడు అయితే బాగుండేదని.. ఇప్పుడు వద్దులేండి అని చెప్పినట్టు రవి వర్మ పేర్కొన్నారు.
ఆరుగురు పతివ్రతలు సినిమా తన కెరీర్కు పునాది అని, ఈ చిత్రం విడుదలైన ఇన్నేళ్లు గడిచినా దాని ప్రభావం ఇప్పటికీ ఉందని రవి వర్మ తెలిపారు. తన మీమ్స్, పోస్టులు ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పారు. అయితే ఆ సినిమాలో పాత్రకు, తన నిజజీవితానికి పూర్తీ తేడా ఉందని పేర్కొన్నాడు. రవి వర్మ అడ్డూరి మొదట సింగపూర్లో ఐటీ ఎంప్లాయ్గా పని చేసేవాడు. మెకట్రానిక్స్లో అడ్వాన్స్డ్ డిప్లొమా, రోబోటిక్స్లో స్పెషలైజేషన్ చేశాడు. సుమారు ఆరున్నర సంవత్సరాలు సింగపూర్లో చదువుకుంటూ, పార్ట్టైమ్, ఆ తర్వాత ఫుల్టైమ్ ఉద్యోగం కూడా చేశానని అతడు స్పష్టం చేశాడు. ఆర్థిక కష్టాల వల్ల తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉండటానికి ఉద్యోగం చేశానని గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో సింగపూర్లో ఉన్న ఒక దూరపు బంధువు, ఐఐటీయన్, ఎమ్మెస్ చేస్తున్న తన కజిన్, రవి వర్మను హీరోలా ఉంటావు. సినిమాల్లోకి వెళ్లవచ్చు కదా అని సరదాగా అనేవారని చెప్పాడు. రవి వర్మ ఆ మాటలను జోక్గా తీసుకున్నారు.
2001లో అనుకోకుండా ఇండియాకు తిరిగి వచ్చిన రవి వర్మ.. నెట్వర్కింగ్ కోర్సు చేసే సమయంలో ఒక ఆకస్మిక సంఘటన తన జీవితాన్ని మలుపు తిప్పిందని తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడి పెళ్లి కోసం విశాఖపట్నం నుంచి రాజస్థాన్కు కారులో వెళ్తుండగా, నాగపూర్ దాటిన తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం తర్వాత సమీపంలోని బడిచోలి గ్రామానికి చేరుకున్నారు. పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు ఆకలిగా ఉండటంతో ఒక దుకాణానికి వెళ్లగా, అక్కడి యజమాని రవి వర్మను ప్రకాశ్ రాజ్గా పొరపాటుపడి, ఆయనకు, స్నేహితులకు వేడి వేడి పాలు, ఆహారాన్ని ఉచితంగా అందించాడు. ఆ యాక్టర్ ట్రీట్ మెంట్ గురించి నవ్వుతూ ఫ్రెండ్కి చెప్పగా.. ఆ తర్వాత అలా నటన వైపు అడుగులు వేశానని రవివర్మ తెలిపాడు. నటనలో శిక్షణ తీసుకుంటుండగానే, కుమార్ రాజా దర్శకత్వంలో ఒక టెలివిజన్ సీరియల్ పైలట్ కోసం అవకాశం లభించింది. అది చివరికి ప్రసారం కాలేదు. అయితే, అదే సమయంలో తిరుపతిలో షూట్ చేసిన ఒక ఎయిర్టెల్ యాడ్ అతడికి మొదటి ఆన్-స్క్రీన్ డెబ్యూగా నిలిచింది. ఈ యాడ్ కూడా అనుకోకుండా లభించింది, తన స్నేహితుడు రాము రాజుకు వచ్చిన అవకాశం తనకు వచ్చిందని రవి వర్మ వివరించాడు.
ఇది చదవండి: నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్.! గుర్తుపెట్టుకోండి.. ఈసారి టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాదే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..