
కలిసుంటే కలదు సుఖం అంటారు కదా..! ఇప్పుడు మన హీరోలు కూడా ఇదే చేస్తున్నారు. సంక్రాంతికి పోటీ పడుతున్నా.. బయట మాత్రం అంతా ఒక్కటే అంటున్నారు. కలిసి కట్టుగా సినిమాలు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఒకరి కోసం ఒకరు అన్నట్లు అంతా కలిసి ముందుకు వెళ్తున్నారు. మనోళ్ల కలిసుందాం రా సినిమా చూసి మిగిలిన ఇండస్ట్రీలకు కళ్ళు కుడుతున్నాయేమో మరి..? చూస్తుండగానే సంక్రాంతి వచ్చేసింది. అందుకే ప్రమోషన్స్లోనూ జోరు పెంచేసారు మన హీరోలు.

అందులో అందరికంటే ముందొచ్చేశారు రామ్ చరణ్. జనవరి 10 గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 12న డాకూ మహరాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. పండక్కి వస్తున్న మూడు సినిమాలకు వారధిగా మారుతున్నారు బాలకృష్ణ. బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు అన్స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు.

ఆహాలో వస్తున్న ఈ షోకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ షోకు సంక్రాంతి హీరోలను గెస్టులుగా తీసుకొస్తున్నారు బాలయ్య. ఇప్పటికే వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ బాగా పేలింది. సినిమా ప్రమోషన్తో పాటు.. పర్సనల్ విషయాలను బాగానే పంచుకున్నారు వెంకీ.

ఇక అన్స్టాపబుల్లో సొంత సినిమా ప్రమోషన్ కూడా చేసుకున్నారు బాలయ్య. డాకు మహరాజ్ టీం ఈ షోకు వచ్చారు.. ఈ ఎపిసోడ్ కూడా బాగానే పేలింది. ముఖ్యంగా సినిమా ముచ్చట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా బాగానే చెప్పించాడు బాలయ్య. నాగవంశీతో చాలా విషయాలు మాట్లాడించాడు కూడా.

అలాగే రామ్ చరణ్ ఈ టాక్ షోకు వచ్చారు. హీరో ఒక్కడే కాదు.. గేమ్ ఛేంజర్ టీం అంతా ఈ షోకు వచ్చారు. దిల్ రాజుతో డాన్సులు చేయించి దుమ్ము లేపాడు బాలయ్య. మొత్తానికి బాలయ్య తన డాకు మహరాజ్తో పాటు.. మిగిలిన రెండు సినిమాలను కూడా తన షోలో ప్రమోట్ చేస్తున్నారు.