Mantralayam Kurnool district : ఆ ప్రాంతంలో ఎవరి ఇంట్లో పాము కనిపించినా.. అతడినే పిలుస్తారు. వెంటనే అతను అక్కడకు చేరుకొని పాములను పట్టి దూరంగా వదిలేస్తుంటాడు. అలాంటి వ్యక్తినే పాము కాటేసి.. పొట్టన బెట్టుకుంది. చిన్నపాటి పొరపాటుతో ఆయన పాము కాటుకు బలయ్యాడు. పాము చనిపోయిందని చేతితో పట్టుకోని పరిశీలిస్తుండగా.. అది కాటేసింది. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. మాలపల్లి గ్రామంలోని పాఠశాల వద్ద శుక్రవారం పాము కనిపించడంతో జనం వెంటనే పాములు పట్టే రంగస్వామికి సమాచారం అందించారు. అతను అక్కడికి చేరుకుని పామును ముందుగా కర్రతో కొట్టాడు.
ఈ క్రమంలో చనిపోయిందనుకుని చేతితో పట్టుకుని పామును పరిశీలిస్తున్నాడు. ఇంతలోనే అది కాటు వేసింది. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రంగస్వామి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మాలపల్లిలో విషాదం నెలకొంది. చిన్నపాటి పొరపాటు రంగస్వామి ఆయువు తీసిందంటూ గ్రామస్థులు పేర్కొంటున్నారు.
Also Read: