జక్కన్న సినిమాలో వేషం..నిండా ముంచేశాడు పాపం

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2019 | 9:43 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందంటే ఎగరైనా సరే గంతేస్తారు. అంతెందుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలే మీ సినిమాలో చిన్న వేషం ఇవ్వండి అని పబ్లిక్‌గా దర్శక ధీరుడుని అడిగిన సందర్భాలు లేకపోలేదు. అలాంటిది సామాన్యులకు జక్కన్న సినిమాలో నటించే ఛాన్స్ అంటే.. ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అలానే అనుకోని  ఓ మహిళా న్యాయవాది నిండా మునిగిపోయింది. ఓ మోసగాడు చెప్పిన మాటలు నమ్మిన మహిళా […]

జక్కన్న సినిమాలో వేషం..నిండా ముంచేశాడు పాపం
Follow us on

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందంటే ఎగరైనా సరే గంతేస్తారు. అంతెందుకు పెద్ద పెద్ద స్టార్ హీరోలే మీ సినిమాలో చిన్న వేషం ఇవ్వండి అని పబ్లిక్‌గా దర్శక ధీరుడుని అడిగిన సందర్భాలు లేకపోలేదు. అలాంటిది సామాన్యులకు జక్కన్న సినిమాలో నటించే ఛాన్స్ అంటే.. ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు.

అలానే అనుకోని  ఓ మహిళా న్యాయవాది నిండా మునిగిపోయింది. ఓ మోసగాడు చెప్పిన మాటలు నమ్మిన మహిళా న్యాయవాది అతడికి ఏకంగా రూ.50లక్షలు సమర్పించుకుంది. తీరా మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు తన డబ్బులు తిరిగిచ్చేయాలని కోరగా..ఎదురుదాడికి దిగాడు. ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశాడు. న్యాయవాది ఫిర్యాదుతో బోయిన్‌పల్లి  పోలీసులు నిందితుల ఆట కట్టించారు.

వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ మహిళా న్యాయవాదికి సినిమాల్లో నటించాలన్న కోరిక ఉంది. ఇందుకోసం ఆమె చాలామందిని సంప్రదించినా అవకాశాలు రాలేదు. కొండాపూర్‌ మసీద్‌బండ్ ప్రాంతానికి చెందిన నరేష్‌కుమార్ అలియాస్ జయ్(28)తో ఆమెకు ఫోన్లో పరిచయమైంది. ఈ క్రమంలో మహిళా న్యాయవాదితో ఫోన్‌లో మాట్లాడాడు. తన పేరు ఆదిత్య అని ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా నిర్మాతల్లో తాను ఒకడినని పరిచయం చేసుకున్నాడు. భార్యతో విడాకులు తీసుకొనేందుకు సలహాలు అడిగాడు. రాజమౌళితో సినిమా తీస్తున్నామని తల్లి పాత్ర ఇస్తానని ఆమెను నమ్మించాడు. స్క్రీన్‌ టెస్ట్‌, అడ్వాన్సులు అంటూ నాలుగు నెలల్లో రూ.50 లక్షలు లాగేశాడు.  రెండు మూడుసార్లు ఆ సినిమా దర్శకుడు రాజమౌళి గొంతుతో ఆమెతో మాట్లాడి నమ్మకం కుదిరేలా చేశాడు.

మహిళా లాయర్‌ తనను పూర్తిగా నమ్మిందని నిర్ధారించుకున్న నరేష్ తన స్నేహితులు రామ, సోమన్నతో పాటు మరో 13 మందితో ముఠాగా ఏర్పడి ఆమె నుంచి డబ్బులు వసూలు చేయసాగాడు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు సుమారు రూ.50లక్షల వరకు ఆమె నుంచి రాబట్టారు. ఆ డబ్బుతో వారంతా జల్సాలు చేశారు.  రాబట్టే సొమ్మును తన బ్యాంకు ఖాతాలో జమ చేయించుకుంటే పోలీసులకు దొరికిపోతానని నరేష్‌ కొత్త పన్నాగం పన్నాడు. కార్లు అద్దెకు తీసుకుని రెండు రోజుల పాటు తిరిగాక డ్రైవర్లకు డబ్బుల్లేవని చెప్పేవాడు. తనకు డబ్బు రావాల్సి ఉందని, నీ ఖాతాలో జమచేయిస్తానని అకౌంట్‌ వివరాలు తీసుకునేవాడు. మహిళా న్యాయవాది ఆ అకౌంట్‌లో జమచేయగానే… నరేష్‌ ఆ డ్రైవర్‌కు చెప్పి కారు అద్దె బకాయి పోను మిగిలిన మొత్తం తనకు ఇమ్మనేవాడు. ఇలా 15 మంది డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయించాడు. ఇప్పుడు వారంతా నిందితులయ్యారని సెంట్రల్ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాస్‌ తెలిపారు.