ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన 13 రామచిలుకలు.. అసలు కథేంటంటే..?

| Edited By:

Oct 17, 2019 | 1:04 PM

బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పదమూడు రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. రామచిలుకలు ఏం నేరం చేశాయి.. వాటిని ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టారు.. అవేమన్న మనుషులా అన్న సందేహాలు తలెత్తవచ్చు. కానీ చట్ట ప్రకారం వాటిని కూడా కోర్టులో ప్రవేశపెట్టాల్సి వచ్చింది పోలీసులకు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో 13 రామచిలుకలను సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఉజ్జెకిస్థాన్ వెళ్తున్న అన్వర్‌జాన్ […]

ఢిల్లీ కోర్టు మెట్లెక్కిన 13 రామచిలుకలు.. అసలు కథేంటంటే..?
Follow us on

బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పదమూడు రామచిలుకలను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. రామచిలుకలు ఏం నేరం చేశాయి.. వాటిని ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టారు.. అవేమన్న మనుషులా అన్న సందేహాలు తలెత్తవచ్చు. కానీ చట్ట ప్రకారం వాటిని కూడా కోర్టులో ప్రవేశపెట్టాల్సి వచ్చింది పోలీసులకు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో 13 రామచిలుకలను సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఉజ్జెకిస్థాన్ వెళ్తున్న అన్వర్‌జాన్ అనే వ్యక్తిని పోలీసులు తనిఖీలు చేశారు. ఆయన లగేజీని స్కానింగ్ చేస్తుండగా.. చెప్పుల బాక్సుల్లో రామచిలుకలు ఉండటాన్ని గమనించారు. వెంటనే వాటిని అందులో నుంచి బయటకు తీశారు. అక్రమంగా విదేశాలకు రామచిలుకలను తరలిస్తున్నాడన్న ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. అయితే రామచిలుకలను తరలిస్తున్నాడన్న విషయాన్ని కోర్టుకు తెలియజేసేందుకు వాటిని కోర్టుకి తీసుకెళ్లారు పోలీసులు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రామచిలుకలను తరలించడం నేరమని అన్వర్‌జాన్‌ను అక్టోబర్ 30 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. ఆ పదమూడు రామచిలుకలను అటవీ సంరక్షణ శాఖ అధికారులకు అందజేస్తూ.. వాటిని అభయారణ్యంలో వదిలిపెట్టాలని కోర్టు తెలియజేసింది. అయితే సీఐఎస్ఎఫ్ చేపట్టిన విచారణలో అన్వర్ జాన్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. ఉజ్జెకిస్థాన్‌లో రామచిలుకలకు విపరీతమైన డిమాండ్ ఉందని.. ఈ నేపథ్యంలోనే ఓల్డ్ ఢిల్లీలో ఓ వ్యాపారస్థుడి దగ్గరి నుంచి కొనగోలు చేశానని తెలిపాడు.