క్షణకాలంలో ఆవిరైన సంతోషం.. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి..

పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడిని మృత్యువు వెంటాడింది. పెళ్లి సంతోషంలో ఉన్న ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది..

క్షణకాలంలో ఆవిరైన సంతోషం.. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి..
Accident
Follow us

|

Updated on: Jun 19, 2022 | 11:20 AM

కలకాలం కలిసి ఉంటామని ఏడడుగులు వేశారు..పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోని కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ జంటను విధి వెక్కిరించింది.. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడిని మృత్యువు వెంటాడింది. పెళ్లి సంతోషంలో ఉన్న ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ప్రమాదంలో వరుడు పవన్ కుమార్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు.. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్‏పేట మండలం పెద్దకొల్లి వసన ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన పవన్ కుమార్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు.. స్థానికంగా ఉండే యువతితో పరిచయం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల కిందట పెద్దలను ఎదురించి ఆమెను తన గ్రామానికి తీసుకువచ్చాడు.. వీరిద్దరు కలిసే ఉంటున్నారు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా వీరిద్దరి కుటుంబాల మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నారు.

రెండు కుటుంబాలు కలిసి శుక్రవారం (జూన్ 17న) వీరి వివాహాన్ని సింహాచలంలో జరిపించారు. పెళ్లి అనంతరం వధువుతోపాటు మిగతా కుటుంబసభ్యులు బస్సులో సొంత గ్రామానికి బయలుదేరారు. అదే సమయంలో వరుడు పవన్ కుమార్ తన మేనమామ బలగ సోమేశ్వర రావుతో కలిసి బైక్ పై స్వగ్రామానికి వస్తుండగా.. ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గర వీరిని బండిని వెనక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. దీంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందగా.. సోమేశ్వర రావుకు తీవ్ర గాయాలయ్యారు.. వెనక వస్తున్న మరో లారీ డ్రైవర్ 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో గాయపడిన వ్యక్తిని రిమ్స్ కు తరలించారు.. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు. పెళ్లైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి చెందడంతో అతని స్వగ్రామంలో విషాదాన్ని నింపింది.