
కరోనా రక్కసి ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. అన్ని వ్యవస్థలు కుంటుపడుతున్నాయి. ఇప్పటికే విద్యారంగంపై భారీ ప్రభావం పడింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇక పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలకు వెళ్ళడం మానివేయకూడదనే ఉద్దేశంతో, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం మధ్యాహ్న భోజన పథకం. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టడం దీని లక్ష్యం. బాలబాలికలను ఆకలి బాధ నుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరేవారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే పథకంతో పేద విద్యార్థుల ఆకలి తీరేది. సర్కారు బడులు మొదలైతే మధ్యాహ్న భోజనం వల్ల పేద విద్యార్థుల ఆకలి తీరేది. కరోనా వ్యాప్తి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేట్లు కనిపింటం లేదు. దీంతో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి.
ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని విద్యార్థుల ఇండ్లకే పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం అన్ని రాష్ట్రలకు లేఖ రాసింది. ఆ మధ్యాహ్న భోజనానికి బియ్యాన్నే ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయడంపై రాష్ట్ర సర్కారుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపింది.
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యార్థుల ఇండ్లకు సన్నబియ్యం పంపిణీపై మార్గదర్శకాలు రూపొందించి, డీఈవోలకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ పద్ధతిని జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో అమలుచేసే అవకాశాలున్నాయి.