అంతులేని విషాదం : కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణం
కనిపించని కరోనా వైరస్..మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రోజురోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది.
COVID-19 Tragedy : కనిపించని కరోనా వైరస్..మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. రోజురోజుకు తన వ్యాప్తిని పెంచుకుంటూ కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఉన్నదాంట్లో తింటూ హాయిగా జీవనం సాగిస్తోన్న జీవితాలలో అంతులేని విషాదాన్ని నింపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురుని కరోనా బలి తీసుకున్న ఘటన అందరినీ కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన ఒక ఫ్యామిలీలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు విడువగా, ఒకరు క్యాన్సర్తో తనువు చాలించారు. తొమ్మిది మంది మగవారు, ఒక ఆడ సంతానం ఉన్న ఫ్యామిలీ రావులపాలెంలో జీవనం సాగిస్తోంది. వీరిలో ఓ మహిళ (77) కొన్నేళ్లుగా క్యాన్సర్లో బాధపడుతూ జులై 26వ తేదీన కన్నుమూశారు.
ఆ కుటుంబం ఈ విషాదం నుంచి బయట పడకముందే ఆమె మొదటి, మూడవ తమ్ముళ్ల కుటుంబాలకు చెందిన ఐదుగురుకి కోవిడ్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మొదటి తమ్ముడు(75) ఆగస్ట్ 6న, ఆయన కుమారుడు(52) జులై 8న చనిపోగా, మూడో తమ్ముడు భార్య (63) ఆగస్టు 5న, కొడుకు (42) జులై 30న, మనవడు(17) ఆగస్ట్ 6న ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రోజుల వ్యవధిలో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆరుగురు మృతిచెందడం అందరి మనసుల్ని కలచివేస్తోంది.
Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు