
హైదరాబాద్, ఏప్రిల్ 19: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా 11.23 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు సోమవారం (ఏప్రిల్ 20వ తేదీ) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేయనుంది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చెక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్టీయే ఏర్పాట్లు చేస్తుంది. కాగా జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 8 వరకు దేశ వ్యాప్తంగా 304 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 11.23 లక్షల మంది హాజరయ్యారు.
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక తొలి విడతలో 14 లక్షలకుపైగా అభ్యర్ధులు పోటీపడ్డారు. అలాగే జేఈఈ మెయిన్ రెండు సెషన్లలో అభ్యర్థులు సాధించిన అత్యుత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని, నార్మలైజేషన్ పద్ధతిలో తుది ర్యాంకులను ఏప్రిల్ 20న ప్రకటిస్తారు. ఇందులో తొలి 2.50 లక్షల మంది ఆల్ ఇండియా ర్యాంకర్లను మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించడానికి అవసరమైన కట్-ఆఫ్ మార్కులను కూడా ఎన్టీఏ సోమవారం విడుదల చేయనుంది. కాగా జేఈఈ మెయిన్ సెషన్1 పరీక్షలు జనవరి 21 నుంచి 29 వరకు జరిగాయి. ఈ ఫలితాలు ఫిబ్రవరి 16న వెల్లడయ్యాయి. ఇప్పుడు సెషన్ 2 తుది ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏప్రిల్ 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. మే 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. అడ్మిట్ కార్డులు మే 11 నుంచి మే 17 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 17న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఒకే రోజులో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్ధులు రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరుకావల్సి ఉంటుంది. అనంతరం జోసా కౌన్సెలింగ్ జూన్ 2 నుంచి మొదలవుతుంది. అడ్వాన్స్డ్లోనూ ఉత్తీర్ణులైన వారికి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ 2026) రాసేందుకు జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవల్సి ఉంటుంది. ఏఏటీ 2026 పరీక్ష జూన్ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. జూన్ 7న ఫలితాలు విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.