
అమరావతి, జూన్ 3: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జూన్ 5వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగుతుంది. ఇక ఫలితాలు జూన్ 18 తరువాత జూన్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్ 5తో పరీక్షలు ముగిశాక 13 రోజుల్లోగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది.
కాగా మే 21 నుంచి ఇంటర్ మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదటిసారిగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకునే బోర్డు అవకాశం కల్పించింది. ఇక ఈ పరీక్షలు ముగిశాక ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల జిల్లా హెడ్ క్వార్టర్స్లో జూన్ 7 నుంచి జూన్ 11 వరకు జరగనున్నాయి. మరోవైపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈఏపీసెట్ విద్యార్ధులు ఎదురు చూస్తు్న్నారు. తొలుత సప్లిమెంటరీ ఫలితాలు వెలువడితే గానీ ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించడం కుదరదని ఉన్నత విద్యామండలి చెబుతుంది. అందుకు కారణం ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటమే. ర్యాంకుల్లో మార్పు, విద్యార్థుల్లో గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చిన తర్వాతే ఎప్సెట్ ఫలితాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంప్రూవ్మెంట్ రాసే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఫలితాలు వెల్లడిస్తే.. ఈ మార్కుల ఆధారంగా ఈఏపీసెట్ ర్యాంకుల ప్రకటిస్తారు.
ఇక ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్సెట్ ఫలితాలను జూన్ మూడో వారంలో అంటే 18వ తేదీ తర్వాతే విడుదల చేయనున్నారు. ఈ తేదీలోపు సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తారు. ఇంటర్మీడియట్ సెకండ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చినందున సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే జూన్ 1న విడుదల కావల్సిన ఈఏపీసెట్ ఫలితాల విడుదల ప్రక్రియ కూడా వాయిదా వేశారు. ఈ ఏడాది ఇంప్రూవ్మెంట్ రాస్తున్న సెకండ్ ఇయర్ విద్యార్ధులు దాదాపు1.50లక్షల మంది ఉన్నారు. ఇందులో ఒక్క మ్యాథమెటిక్స్ సబ్జెక్టు వారే లక్ష మంది వరకు ఉన్నారు.