
అమరావతి, జులై 12: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIEAP) ప్రథమ, ద్వితీయ సంవత్సరాల సప్లిమెంటరీ పరీక్షల రీకౌంటింగ్ (RC), రీవెరిఫికేషన్ (RV) ఫలితాలను విడుదల చేసింది. మే–జూన్ నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల మార్కులపై సందేహాలున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను జులై 10న బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటించారు.
జనరల్, ఒకేషనల్ కోర్సులకు చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు తెలిపింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, అక్నాలెడ్జ్మెంట్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫలితాలను పరిశీలించవచ్చని సూచించింది. రీవెరిఫికేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చిన విద్యార్థులకు సవరించిన మార్కుల మెమోలను సంబంధిత కళాశాలల లాగిన్లకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను త్వరగా పరిశీలించి, మార్కుల్లో మార్పులు జరిగాయా లేదా అనేది నిర్ధారించుకోవాలని బోర్డు సూచించింది. కాగా మే 21 నుంచి జూన్ 4 వరకు జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు జూన్ 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను బోర్డు ప్రకటించింది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా మీ ఫలితాలను తెలుసుకోండి.