
భారతీయ రైల్వేలు కాలంతో పాటు మారుతున్నాయి. కొత్త కోచ్లు, హైస్పీడ్ రైళ్లు, అధునాతన సదుపాయాలు వస్తున్నాయి. కానీ దశాబ్దాలుగా ఏసీ కోచ్లలో మాత్రం ఒకే ఒక విషయం మారలేదు.. అదే తెల్లటి బెడ్షీట్లు. రైల్వేలు రంగురంగుల షీట్లు వాడకుండా కేవలం తెలుపు రంగునే ఎందుకు ఎంచుకున్నాయి? దీని వెనుక బలమైన శాస్త్రీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయి.
రైల్వేలో పరిశుభ్రత అనేది అత్యంత ముఖ్యం. వేలాది మంది ప్రయాణికులు వాడే ఈ బెడ్షీట్లను శుభ్రం చేయడానికి రైల్వే శాఖ 121 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద వేడి ఆవిరిని ఉపయోగిస్తుంది. ఈ పద్ధతి వల్ల మురికి వదలడమే కాకుండా బ్యాక్టీరియా, ఇతర క్రిములు పూర్తిగా నశిస్తాయి.
ఇంత అధిక ఉష్ణోగ్రత వద్ద పదే పదే ఉతికినప్పుడు రంగు షీట్లు అయితే త్వరగా వెలిసిపోతాయి. కానీ తెల్లటి బట్ట ఎంత ఉతికినా కొత్తదానిలా మెరుస్తూనే ఉంటుంది. రంగు షీట్లు వాడితే వాటిని తరచుగా మార్చాల్సి వస్తుంది. దీనివల్ల రైల్వేకు అనవసర ఖర్చు పెరుగుతుంది.
తెలుపు రంగు మీద చిన్న మరక ఉన్నా వెంటనే కనిపిస్తుంది. షీట్ శుభ్రంగా ఉందో లేదో ప్రయాణికులు సులభంగా గుర్తించవచ్చు. రంగు షీట్లు అయితే మురికి సరిగ్గా కనిపించదు, ఇది ప్రయాణికుల్లో అసంతృప్తికి దారితీస్తుంది.
అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా ఉండాలని రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త ప్రయోగం చేస్తోంది. రాజస్థాన్ హస్తకళల శైలిలో ఉండే సంగనేరి ప్రింట్లు కలిగిన బెడ్షీట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇవి ఎక్కువ కాలం ఉండేలా, ఉతికినా రంగు పోకుండా డిజైన్ చేశారు. ప్రయాణికుల నుండి సానుకూల స్పందన వస్తే త్వరలోనే అన్ని రైళ్లలో ఈ రంగురంగుల ప్రింటెడ్ షీట్లను మనం చూడవచ్చు.
బెడ్షీట్లు, దిండు కవర్లు ప్రతి ప్రయాణానికి మారుస్తారు కానీ దుప్పట్ల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఒక RTI ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం.. రైల్వే దుప్పట్లను వాటి పరిస్థితిని బట్టి నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉతుకుతారు. అందుకే ప్రయాణికులు బెడ్షీట్ల విషయంలో సుఖంగా ఉన్నప్పటికీ దుప్పట్ల విషయంలో మాత్రం పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా 46 సొంత లాండ్రీలను, మరో 25 ప్రైవేట్ లాండ్రీలను నిర్వహిస్తూ ప్రయాణికులకు శుభ్రమైన బెడ్ రోల్స్ అందించడానికి కృషి చేస్తున్నాయి.