
కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారి కోసం అనేక స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, మహిళలు, వృద్దులు, చిన్నారులకు ప్రత్యేకంగా పొదుపు పథకాలను అందుబాటులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వ హామీ లభించే ఈ పొదుపు ఖాతాల్లో కోట్లాది మంది పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకాలు కావడంతో డబ్బులు భద్రంగా ఉంటాయనే కారణంతో ఎక్కువమంది పొదుపు చేసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో ఒకటి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం ప్రయోజనాలు ఏంటి..? వడ్డీ ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం.
రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందాలనుకునేవారికి సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది మంచి పథకమని చెప్పవచ్చు. ఇందులో పెట్టే పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. దీంతో మీ డబ్బుకు ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. అంతేకాకుండా అనేక పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. ఇందులోని పెట్టుబడులకు ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లను కేంద్రం మారుస్తూ ఉంటుంది. మీరు బ్యాంకులు లేదా పోస్టాఫీసుల ద్వారా ఈ అకౌంట్ సులువుగా తెరవొచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లితే సరిపోతుంది. కొన్ని బ్యాంకులు ఆన్ లైన్ ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఈ పథకంలో చేరాలంటే కనీసం 60 ఏళ్లు నిండి ఉండాలి. స్టాక్ మార్కెట్లతో సంబంధం ఉండదు. మీరు పొదుపు చేసుకునే నగదుకు ఆదాయం ఫిక్స్డ్గా ఉంటుంది. వృద్దాప్యంలో స్థిర ఆదాయం కోరుకునేవారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు. రోజువారీ అవసరాలకు డబ్బులు అవసరమయ్యేవారికి సీనియర్ సిటిజన్ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. మీ రోజువారీ అవసరాలకు ఎంత ఉపయోగపడతాయి..? ఎంత ఇన్వెస్ట్ చేస్తే సరిపోతాయి? అనేది ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసే మంచిది.
-60 ఏళ్ల వయస్సు దాటి ఉండాలి
-భారత పౌరులు అయి ఉండాలి
-ఒక అకౌంట్పై గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు
-కనీస పెట్టుబడి రూ.వెయ్యిగా ఉంది
-మెచ్యూరిటీ కాలం ఐదేళ్లుగా ఉంది
-మెచ్యూరిటీ కాలాన్ని మూడేళ్లు పొడిగించుకునే అవకాశముంది
-మూడు నెలలకు ఒకసారి అకౌంట్లో వడ్డీ జమ చేస్తారు
-సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు అనేది ఉంటుంది
-వృద్ద దంపతులు వేర్వురుగా అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది