
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. రేపో రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రేపో రేటులో ఎలాంటి మార్పులు చేయలేదని శుక్రవారం ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుత రెపో రేటు 5.25 శాతం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రకటించింది. అలాగే 2025-26 జీడీపీ వృద్ది రేటుపై కీలక అంచనా వేసింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటు 7.4 శాతంగా నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. ఇవాళ ఆర్బీబీ ద్రవ్య విధాన కమిటీ(MPC) సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ వరకు ఇవి జరగనున్నాయి. ఆర్ధిక సంవత్సరం 2025-26 సంవత్సరానికి సంబంధించి ఇదే చివరి ద్వైమాసిక విధాన సమావేశాలుగా చెప్పవచ్చు. ఈ సమావేశంలో రెపో రేటుపై నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐలు కట్టేవారికి ఊరట లభించింది. కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత జరుగుతున్న ఈ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడం, త్వరలో ఇది అమల్లోకి రానున్న క్రమంలో ఆర్బీఐ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. వ్యాపారులు, మార్కెట్ వర్గాలు కూడా ఆర్బీఐ నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు తన విధాన ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆరుగురు సభ్యుల కమిటీ రెపో రేట్లను 5.25 శాతంగా కొనసాగిస్తూ విధాన వైఖరిని తటస్థం వద్ద ఉంచాలని నిర్ణయించింది.
కాగా డిసెంబర్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అప్పటివరకు 5.50 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 5.25 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. కాగా ఆరోగ్యకరమైన ఖరీప్ ఉత్పత్తి, తగినంత ఆహార ధాన్యాల బఫర్ నిల్వలు, అనుకూలమైన రబీ విత్తనాల క్రమంలో ఆహార సరఫరా అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. 2025-26లో దేశ స్థూల దేశీయోత్పత్తి(GDP) 7.4 శాతం పెరుగుందని అంచాన వేసింది. ప్రైవేట్ వినియోగం, స్థిర పెట్టుబడి మొత్తం వృద్దిక దోహదపడుతుందని అంచనా వేశారు. రోజువారీ సగటు ప్రాతిపదికన సిస్టమ్ లిక్విడిటీ రూ.75 వేల కోట్లుగా ఉందని, డిసెంబర్ – జనవరిలో లిక్విడిటీని పెంచడానికి RBI అనేక చర్యలు తీసుకుందని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.