
దేశంలో కర్మాగారాలు, కంపెనీలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేయని వారు చాలా మంది ఉన్నారు. కొందరు చేతిబండ్లు నడుపుతారు, కొందరు రిక్షాలు నడుపుతారు.. కొందరు కూలీలుగా పనిచేస్తారు.. మరికొందరు చిన్న వ్యాపారాలు నిర్వహిస్తారు. వయసు పెరిగి, పనిచేసే సామర్థ్యం తగ్గుతున్న కొద్దీ తమ ఇంటి ఖర్చులను ఎలా నిర్వహించుకోవాలనేదే వీరికి అతిపెద్ద ఆందోళన. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ (పీఎం-ఎస్వైఎం) పథకం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఇది 60 ఏళ్ల వయస్సు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.3,000 పింఛను అందిస్తుంది.
ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ యోజన 2019 సంవత్సరంలో ప్రారంభించింది కేంద్రం. ఇది అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజల కోసం ఉద్దేశించిన పింఛను పథకం. ఈ పథకంలో చేరిన తర్వాత లబ్ధిదారులు తమ వయస్సు ఆధారంగా ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని జమ చేయాలి. వారి తరపున కేంద్ర ప్రభుత్వం సమానమైన మొత్తాన్ని అందిస్తుంది. 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత లబ్ధిదారులు నెలకు కనీసం రూ.3,000 పింఛను పొందుతారు.
ఈ పథకం ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పనిచేస్తూ, తక్కువ ఆదాయం ఉన్న వారి కోసం రూపొందించారు. వీరిలో వీధి వ్యాపారులు, రిక్షా లాగేవారు, ఈ-రిక్షా డ్రైవర్లు, గృహ కార్మికులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, తోలు, చేనేత పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు, చిన్న దుకాణదారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి కొన్ని అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తుదారులు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వారి నెలవారీ ఆదాయం రూ.15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అసంఘటిత రంగంలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. అలాగే ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులు. ఇది కాకుండా, అతను EPFO, ESIC లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి మరే ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకంలోనూ సభ్యుడిగా ఉండకూడదు.
పథకంలో మీరు జమ చేయవలసిన మొత్తం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా 18 ఏళ్ల వయస్సులో పథకంలో చేరితే వారు నెలకు కేవలం రూ.55 జమ చేయాల్సి ఉంటుంది. 40 ఏళ్ల వయస్సులో చేరిన వారు నెలకు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు జమ చేసిన మొత్తానికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.100 జమ చేస్తే ప్రభుత్వం కూడా రూ.100 జతచేస్తుంది.
ఈ పథకంలో చేరడం చాలా సులభం. మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శిస్తే సరిపోతుంది. మీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అందించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆటో-డెబిట్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీంతో మీకు గుర్తు లేకపోయినా ఆటోమేటిక్గా డబ్బులు కట్ అవుతాయి. ఇది ప్రతి నెలా ఖాతా నుండి నిర్ణీత మొత్తాన్ని ఆటోమేటిక్గా డెబిట్ చేస్తుంది. తద్వారా ప్రత్యేక చెల్లింపుల అవసరాన్ని తొలగిస్తుంది.
లబ్ధిదారుడు 60 సంవత్సరాల వయస్సుకి చేరుకున్నప్పుడు, అతను/ఆమె ప్రతి నెలా రూ.3,000 పింఛను పొందడం ప్రారంభిస్తారు. భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో నమోదు చేసుకుంటే వారికి వేర్వేరు పింఛన్లు అందుతాయి. అంటే ఆ కుటుంబం నెలకు గరిష్టంగా రూ.6,000 వరకు పింఛను ప్రయోజనాన్ని పొందవచ్చు.
పింఛను ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుడు మరణిస్తే, కుటుంబ పింఛను అతని/ఆమె జీవిత భాగస్వామికి అందిస్తారు. ఈ కుటుంబ పింఛను ప్రాథమిక పింఛనులో 50 శాతం ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి రూ.3,000 పింఛను పొందుతుంటే వారు నెలకు రూ.1,500 అందుకుంటారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి