రూ.598 కోట్లు.. ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి ఐటీ నోటీసులు! అసలు మ్యాటర్‌ ఏంటంటే..?

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ ఇస్త్రీ మనిషి జితేంద్ర కుమార్‌కు రూ.598 కోట్ల లావాదేవీలపై ఐటీ నోటీసు వచ్చింది. రెండేళ్ల క్రితం పోయిన తన పాన్ కార్డును దుర్వినియోగం చేసి ఎవరో జీఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మోసం చేశారని తేలింది.

రూ.598 కోట్లు.. ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి ఐటీ నోటీసులు! అసలు మ్యాటర్‌ ఏంటంటే..?
Gst Registration Scam

Updated on: Apr 09, 2026 | 7:42 PM

రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి వెలుగులోకి వచ్చిన ఒక ఆశ్చర్యకర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బట్టలు ఇస్త్రీ చేసి జీవనం సాగించే జితేంద్ర కుమార్ అనే వ్యక్తి పేరుతో రూ.598 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించి ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేయడం తీవ్ర సంచలనం రేపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. @NewsAlgebraIND చేసిన పోస్టు ద్వారా ఈ కేసు ప్రజల దృష్టిని ఆకర్షించింది. వీడియోలో జితేంద్ర తన పరిస్థితిని వివరిస్తూ, తనకు ఎలాంటి భారీ వ్యాపారాలు లేదా లావాదేవీలతో సంబంధం లేదని స్పష్టం చేశాడు.

తన పాన్ కార్డు రెండేళ్ల క్రితం పోయిందని, అదే సమయంలో ఎవరో అతని వివరాలను దుర్వినియోగం చేసి జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుని సూరత్ లో ఒక సంస్థ ప్రారంభించినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ వ్యవహారాల వల్లే అతని పేరుతో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఈ విషయంపై షో-కాజ్ నోటీసు జారీ చేయగా, సంబంధిత బ్యాంకు మేనేజర్‌కూ నోటీసులు పంపినట్లు సమాచారం. జితేంద్ర మాత్రం తాను అమాయకుడినని, గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్లు, న్యాయవాదుల వద్ద తిరుగుతున్నానని వేదన వ్యక్తం చేశాడు. ఈ ఒత్తిడితో పని కూడా చేయలేకపోతున్నాను అని అతను తెలిపాడు.

జితేంద్ర తరఫు న్యాయవాది రాకేష్ థాడా గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేసులో పాలి కి చెందిన ఒక వ్యాపారవేత్త పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన బయటపడిన తర్వాత నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. OTPలు, KYC ప్రక్రియలు ఎలా దాటేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ప్రజల వ్యక్తిగత వివరాలు ఎంత సులభంగా దుర్వినియోగం అవుతున్నాయో ఈ ఘటన మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంఘటన పాన్ కార్డు భద్రత, డిజిటల్ ఫ్రాడ్‌లపై అప్రమత్తత అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us