
కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం పీఎఫ్ పథకం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ స్కీమ్ నిర్వహిస్తోంది. ఈ ఫండ్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్పై వడ్డీతో పాటు 60 ఏళ్ల రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత పెన్షన్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం మరో ప్రయోజనం కూడా అందిస్తోంది. అదే జీవిత బీమా. అవును.. పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో లైఫ్ ఇన్యూరెన్స్ సౌకర్యం అందిస్తోంది. దీని గురించి చాలామంది అవగాహన కలిగి ఉండటం లేదు. పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన సమయంలో నామినీకి పరిహారం చెల్లిస్తారు. ఈ బీమా కవరేజీ ఎంత..? ఎలా తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఈపీఎఫ్ఓ రూ.7 లక్షల జీవిత బీమా అందిస్తోంది. బయట లైఫ్ ఇన్యూరెన్స్ తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించకుండానే ఉచితంగా ఈపీఎఫ్వో జీవిత బీమా పథకం అమలు చేస్తోంది. ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్యూరెన్స్ స్కీమ్ పేరుతో దీనిని కొనసాగిస్తోంది. ఈపీఎఫ్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తోంది. ఉద్యోగం చేసే సమయంలో ఖాతాదారుడు మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసులకు రూ.7 లక్షలు అందిస్తారు. యాక్టివ్ ఈపీఎఫ్ఓ మెంబర్గా ఉన్నన్ని రోజులు ఈ బీమా కవరేజీ కొనసాగుతూ ఉంటుంది. ఈ బీమా కోసం ఎలాంటి మెడికల్ టెస్టుల అవసరం కూడా లేదు.
ఉద్యోగి మరణించిన సమయంలో క్లెయిమ్ కోసం నామినీ లేదా వారసులు అప్లై చేసుకోవాలి. డెత్ సర్టిఫికేట్, కేవైసీ, బ్యాంక్ వివరాలు, ఫారం IF సమర్పించాలి. ఈపీఎఫ్వో లేదా ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ నుంచి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్వో మెంబర్గా ఉండి సర్వీసులో కొనసాగుతుంటే క్లెయిమ్ అందిస్తారు. జీవిత బీమా పథకం కోసం ఉద్యోగి ఎలాంటి కంట్రిబ్యూషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ నుంచి రూ.75 వరకు చెల్లించడం జరుగుతుంది. కంపెనీ నుంచి చేసే చెల్లింపుల ఆధారంగా కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం అందుతుంది. ఈపీఎఫ్లో ఖాతాదారులుగా ఉన్న చాలామందికి ఈ పథకం గురించి తెలియదు. దీంతో ఉద్యోగి మరణించిన సమయంలో కుటుంబసభ్యులు ఈ బెనిఫిట్ పొందలేకపోతున్నారు. ఉద్యోగి మరణించిన సమయంలో కుటుంబానికి ఈ పథకం ఆర్ధిక భద్రతను కల్పిస్తుంది.