
క్రెడిట్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఎక్కువ రివార్డులు వస్తాయని భావించే కాలం క్రమంగా మారుతోంది. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, సినిమా టిక్కెట్లపై ఆఫర్లు వంటి ప్రయోజనాలు ఇప్పుడు కఠినమైన ఖర్చు నిబంధనలకు అనుసంధానించబడడంతో, అనేక కార్డులను కలిగి ఉండటం కంటే తక్కువ కార్డులను సమర్థవంతంగా ఉపయోగించడం మెరుగైన వ్యూహంగా మారుతోంది. నిపుణుల ప్రకారం వినియోగదారులు 2–4 క్రెడిట్ కార్డులకే పరిమితం అవుతూ, తమ ఖర్చు అలవాట్లకు సరిపోయే విధంగా ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. పైసా బజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ ప్రకారం, లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఇప్పుడు త్రైమాసిక లేదా నెలవారీ ఖర్చు పరిమితులతో ముడిపడి ఉన్నందున, వినియోగదారులు వ్యూహాత్మకంగా కార్డులను ఎంచుకోవాలి.
ఉదాహరణకు బుక్ మై షో ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్ పొందాలంటే, ICICI బఆయంక్ Bank క్రెడిట్ కార్డ్ వినియోగదారులు గత త్రైమాసికంలో కనీసం రూ.25,000 ఖర్చు చేయాలి. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై జూలై 1 నుంచి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం రూ.60,000 ఖర్చు షరతు అమల్లోకి రానుంది. ఇదే విధంగా ICICI బ్యాంక్ కూడా ఎంపిక చేసిన కార్డులపై లాంజ్ యాక్సెస్ కోసం రూ.75,000 ఖర్చు నిబంధనను అమలు చేయనుంది. ఈ మార్పులతో పాత ఎక్కువ కార్డులు – ఎక్కువ ప్రయోజనం అనే వ్యూహం ప్రభావాన్ని కోల్పోతోంది. బ్యంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి ప్రకారం ఖర్చును అనేక కార్డులపై విభజిస్తే, ఒక్క కార్డుపైనా పూర్తి ప్రయోజనం పొందడం కష్టమవుతుంది.
ఇప్పుడు సరైన వ్యూహం ఏమిటంటే ఖర్చును ఏకీకృతం చేయడం. అంటే మీ అవసరాలకు సరిపోయే 2–3 కార్డులను ఎంచుకుని, వాటిపై క్రమబద్ధంగా ఖర్చు చేయడం. ప్రయాణం, రోజువారీ ఖర్చులు, అధిక విలువ గల కొనుగోళ్ల కోసం వేర్వేరు కార్డులను ఉపయోగించడం ఉత్తమంగా భావిస్తున్నారు. అదనంగా పునరుద్ధరణ రుసుములు, రివార్డు పాయింట్ల గడువు, మారుతున్న ఆఫర్లు వంటి అంశాలను గమనించడం కూడా చాలా ముఖ్యం. SaveSage వ్యవస్థాపకుడు ఆశిష్ అభిప్రాయం ప్రకారం స్పష్టమైన పాత్రలతో 2–3 కార్డులను ఎంపిక చేసుకోవడం ద్వారా గరిష్ట విలువను పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి