
అపర కుబేరుడు, భారతదేశ ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తన పెళ్లితో మొత్తం ప్రపంచం ఇండియా వైపు తిరిగి చూసేలా చేసిన అనంత్ ఇప్పుడు సేవా కార్యక్రమాల ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. గుజరాత్లోని ప్రసిద్ధ అంబాజీ ఆలయానికి ఆయన రూ.27.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. భక్తి భావనతో పాటు సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తూ ఈ విరాళాన్ని ప్రత్యేకంగా జై అంబే తిథి భోజన్ యోజన కోసం అందించారు.
ఈ పథకం ప్రధాన లక్ష్యం అంబాజీ ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడూ ఆకలితో వెళ్లకూడదనేదే. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు ఆలయానికి చేరుతుండగా, వారికి రోజుకు రెండుసార్లు ఉచితంగా భోజనం అందించేందుకు ఈ నిధులు వినియోగిస్తారు. ట్రస్ట్ అంచనాల ప్రకారం ఈ అన్నదాన కార్యక్రమానికి రోజుకు సుమారు రూ.1.51 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ యోజనకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటి రోజే మొత్తం విరాళాలు రూ.30 కోట్లకు మించి చేరాయి. ఇందులో ప్రధాన దాతగా అనంత్ అంబానీ నిలిచారు. ఆయన ఇచ్చిన నిధులు వచ్చే ఐదేళ్లపాటు ఆహార సేవ ఖర్చును భరించేలా ప్రణాళిక రూపొందించారు.
ఇతర దాతల్లో అహ్మదాబాద్కు చెందిన ఒక భక్తుడు 35 ప్రత్యేక దినాల్లో భోజన సేవను స్పాన్సర్ చేయడానికి రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చారు. కార్యక్రమ ప్రారంభోత్సవంలో అంబాజీ దేవస్థాన్ ట్రస్ట్, జిల్లా అధికారులు రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని ప్రధాన దాతలను సత్కరించారు. ఈ చొరవతో భక్తులకు ఉచితంగా సంపూర్ణ, పోషకాహారం అందడంతో పాటు వారి ఆధ్యాత్మిక యాత్ర మరింత సార్థకంగా మారుతుందని ట్రస్ట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి