కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఉన్న వచన పితామహ ‘డాక్టర్ పీజీ హలకట్టి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ కాలేజీలో శనివారం ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సందీప్ వతార్ అనే వ్యక్తి డాక్టర్ పీజీ హలకట్టి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కాలేజీలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. అయితే ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పాక్-ఇండియా యుద్ధంపై బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. అనంతరం మరో పోస్ట్లో ‘భక్తులు’ అని సంబోధిస్తూ యుద్ధవాతావరణాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏబీవీపీ కార్యకర్తలు ఆయనను ‘దేశద్రోహి’ అంటూ విమర్శించారు. అంతే కాకుండా ఆయనను మోకాళ్లపై కూర్చోబెట్టారు. క్షమాపణ చెప్పిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే దీనిపై ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.