
శ్రీకాకుళం: ప్రధాని మోడీ ఉచ్చులో పడి చంద్రబాబు ఏపీకి అన్యాయం చేశారని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విమర్శలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పారాడింది, తెచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అపార పాలనానుభవం ఉన్న చంద్రబాబుకు 55 నెలల తర్వాత అయినా జ్ఞానోదయం అయ్యిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీని ఓడించి పకోడీలు అమ్ముకునేలా చేయాలని రఘువీరా అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రత్యేకహోదా భరోసా యాత్ర ముగింపు సందర్భంగా రఘువీరా మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఓవైపు అన్యాయం జరుగుతుంటే ప్రతిపక్ష నేత జగన్ మాత్రం బీజేపీనే నమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయకుంటే మరోసారి ఓట్లు అడిగేందుకు ప్రజల ముందుకు రాబోమని రఘువీరా స్పష్టం చేశారు.