Bird Flu : ధోని ఆర్డర్ ఇచ్చిన కడక్నాథ్ కోళ్లకు బర్డ్ ఫ్లూ.. నిర్ధారించిన ప్రభుత్వ అధికారులు
కోెళ్ల పరిశ్రమలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఈ బర్డ్ఫ్లూ ఎఫెక్ట్ టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై కూడా పడింది.
Bird Flu Hit on Kadaknath : కోెళ్ల పరిశ్రమలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లోని పక్షులకు ఈ మహమ్మారి సోకడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనల్లో ఉన్నారు. అయితే ఈ ప్రభావం టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై కూడా పడింది.
ధోనీ కోళ్ల ఫామ్ కోసం పెంచిన 2500 కడక్నాథ్ కోడి పిల్లలు బర్డ్ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత ధోనీ పౌల్ట్రీ బిజినెస్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే మధ్యప్రదేశ్లో బర్డ్ ఫ్లూ అంతకంతకూ పెరిగిపోతుండటంతో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. రుడిపాండా గ్రామంలోని కడక్ నాథ్ కోళ్ల ఫాంలోని కోళ్ల నమూనాలను భోపాల్ నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లో పరీక్షించగా బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు తేలిందని మధ్యప్రదేశ్ పశువైద్య విభాగం డైరెక్టరు డాక్టర్ ఆర్కే రోక్డే అధికారిక లేఖలో తెలిపారు.
కడక్నాథ్ కోళ్లకు ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రంలోని ఝబువా జిల్లాకూ ఈ బర్డ్ఫ్లూ పాకింది. ఈ జిల్లాలోని రుదిపాండా గ్రామంలో ఉన్న కడక్నాథ్ కోళ్ల ఫారంలోని కోళ్లకు హెచ్5ఎన్1 (H5N1) వైరస్ సోకిందని వ్యవసాయ విజ్ఞాన కేంద్రం అధిపతి కె.ఎస్. తోమర్ చెప్పారు. దీనికి కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతం మొత్తాన్నీ ఇన్ఫెక్టెడ్ జోన్గా గుర్తించారు.
తనకు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నుంచి 2000 కడక్నాథ్ కోళ్ల కోసం ఆర్డర్ వచ్చినట్లు ఈ కోళ్ల ఫారం ఓనర్ వినోద్ మేదా చెబుతున్నాడు. గత నెలలోనే ఈ ఆర్డర్ వచ్చిందని చెప్పాడు. అయితే వాతావరణం సరిగా లేక వాటిని డెలివర్ చేయలేకపోయామని తెలిపాడు.