YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నైలో ప‌ర్యటించారు. తన బంధువుల వివాహ వేడుకలో సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ మ్యారేజ్‌లో కోలీవుడ్‌ అగ్ర హీరోలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. తమిళనాడు సీఎం సహా అగ్ర రాజకీయ నేతలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు.

YS Jagan: చెన్నైలో కుటుంబ వివాహ వేడుకలో పాల్గొన్న జగన్.. తరలివచ్చిన రాజకీయ, సినీ ప్రముఖులు
Ys Jagan Chennai Visit

Updated on: Feb 09, 2026 | 8:08 AM

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్‌రెడ్డి తనయుడు సాహిల్‌ వివాహ వేడుక చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగిన సాహిల్, వేదిక పెళ్లి వేడుకల్లో వైఎస్‌ జగన్, భారతి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు జగన్‌ దంపతులు. జగన్‌ చెన్నై రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో.. లీలా ప్యాలెస్‌ సందడిగా మారింది.

ఈ వివాహ వేడుకలో వైఎస్‌ విజయలక్ష్మి, వైఎస్‌ అవినాష్ రెడ్డి, వైసీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు అనిల్, విడుదల రజినీ,  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సినీ నటుడు మంచు మోహన్ బాబుతో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు.

వైఎస్‌ అనిల్‌రెడ్డి కుమారుడు సాహిల్, వేదిక పెళ్లి వేడుకల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌తో కొద్దిసేపు ముచ్చటించగా.. ఒకరికొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. పలువురు కోలీవుడ్‌ అగ్ర హీరోలు వివాహ వేడుకల్లో సందడి చేశారు. టీవీకే అధినేత విజయ్‌, సూర్య, కార్తీ సైతం ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు.  వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు జగన్. దీంతోపాటు.. విజయ్‌, సూర్య, కార్తీ.. జగన్‌తో కలిసి కూర్చుని కొద్దిసేపు ముచ్చటించడం స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది.  మొత్తంగా.. చెన్నైలో జరిగిన వివాహ వేడుకలో పలువురు పొలిటికల్‌ స్టార్స్‌, సినిమా స్టార్ హీరోల కలయిక హాట్‌టాపిక్‌గా మారింది.