AP News: క్రైమ్‌ సీన్‌లో కీలకంగా మారిన ఆ ‘రెండు’.. ఆ నలుగురు చావుకు అసలు కారణమిదేనా.!

| Edited By: Ravi Kiran

Dec 29, 2023 | 11:57 AM

అనకాపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు అనుమనిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

AP News: క్రైమ్‌ సీన్‌లో కీలకంగా మారిన ఆ రెండు.. ఆ నలుగురు చావుకు అసలు కారణమిదేనా.!
Represemtative Image
Follow us on

అనకాపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. విషాహారం తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు అనుమనిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు రామకృష్ణ, భార్య దేవి ఏడాది క్రితం నుంచి అనకాపల్లిలోనే వుడ్‌పేటలో నివాసం ఉంటున్నారు. వాళ్లకు ముగ్గురు కుమార్తెలు పదిహేను ఏళ్ల వైష్ణవి, పదమూడేళ్ల ఏళ్ల జాహ్నవి, తొమ్మిదేళ్ల ప్రియ ఉన్నారు. అంతా కలిసి అనకాపల్లిలోని లక్ష్మీ ప్యారడైజ్ అపార్ట్మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా దంపతులు సహా ఇద్దరు కుమార్తెలు విగత జీవులుగా మారారు. చిన్న కూతురు కుమార్తె వాళ్లను ఎంత తట్టిలేపిన లేవలేదు. దీంతో అర్ధరాత్రి బయటకు వచ్చిన ప్రియ.. ఇరుగుపొరుగు వారి ఇంటి తలుపులు తట్టింది. విషయాన్ని చెప్పింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు.. పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి ఇంట్లో పడి ఉన్న.. శివరామకృష్ణ దేవితో పాటు ఇద్దరు కుమార్తెలను పరీక్షించారు. నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. అస్వస్థతకు గురైన చిన్న కుమార్తె ప్రియను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రియ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు జడ్జి.

బిర్యానీ ప్యాకెట్.. ఆ పౌడర్..

రంగంలోకి దిగిన క్లూస్ టీం సిబ్బంది, డిఎస్పి సుబ్బరాజు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపార్ట్మెంట్‌లో విచారించారు. ఘటనాస్థలంలో క్లూస్ టీం వెరిఫై చేసింది. అక్కడ బిర్యానీ ప్యాకెట్, కెమికల్ పౌడర్ ఆనవాళ్లు గుర్తించారు. ఆ పౌడర్‌ను బంగారం మెరుగు కోసం వాడే సైనేడ్‌గా అనుమానిస్తున్నారు. ఆహారంలో ఆ పౌడర్ కలుపుకుని తిని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. తెనాలిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు.. మరికొంత సమాచారాన్ని సేకరించారు. అప్పులపాలై ఏడాదికాలంగా కనిపించకుండా పోయినట్టు రామకృష్ణ సోదరుడు తమతో చెప్పినట్టు డిఎస్పి సుబ్బరాజు తెలిపారు. ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించామన్నారు డి.ఎస్.పి. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బంధువులు అనకాపల్లి చేరుకుని.. ఆ తర్వాత మృతదేహాలకు పోస్టుమార్టం జరిగిన తర్వాత ఆత్మహత్యకు గల అసలు కారణం, ఎటువంటి విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నారని విషయం తేలుతుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకునే విగత జీవులుగా మారడం.. ఏం జరిగిందో తెలియకుండా అమాయకంగా ఉన్న చిన్న కుమార్తె ఆసుపత్రి పాలైన ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేస్తుంది.