రెడ్ వైన్ తాగి నిద్రపోయాం.. విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది..? సంచలన విషయాలు

విశాఖ టెకీ రాధా గాయత్రి మృతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. మరణానికి ముందు రోజు భర్త శ్రీచరణ్‌తో కలిసి రిషికేశ్, డెహ్రాడూన్‌లో జాలీగా గడిపిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముస్సోరీలోని హోమ్‌స్టేలో రెడ్ వైన్ తాగి నిద్రపోయామని, ఉదయం లేచి చూడగా గాయత్రి ముక్కు నుంచి రక్తం కారుతోందని భర్త శ్రీచరణ్ తెలిపాడు. అయితే, గాయత్రి తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు ఎదురుచూస్తున్నారు.

రెడ్ వైన్ తాగి నిద్రపోయాం.. విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది..? సంచలన విషయాలు
Radha

Updated on: Jun 21, 2026 | 11:07 AM

విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది.. అనేది సంచలనంగా మారింది. అంతకు ముందు రాధా గాయత్రి, శ్రీచరణ్ తీసుకున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గాయత్రి మరణానికి ముందురోజు ఇద్దరూ జాలీగా తిరిగినట్టు ఈ ఫొటోలు, వీడియోల్లో తెలుస్తోంది. రిషికేష్, డెహ్రాడూన్‌లోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ, శ్రీచరణ్, రాధా గాయత్రి చాలా ఎంజాయ్ చేసినట్లు అర్థం అవుతోంది. ఇద్దరూ కలిసి బంగీ జంప్ సహా వివిధ స్పోర్ట్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు. డెహ్రాడూన్ క్లాక్ టవర్ దగ్గర గాయత్రి, శ్రీ చరణ్ సెల్ఫీ కూడా తీసుకున్నారు. రిషికేష్‌లో బంగీ జంప్.. బోటింగ్‌ చేశారు. స్వయంగా శ్రీ చరణ్ ఈ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఇద్దరూ కలిసి రెంట్‌కు తీసుకున్న స్కూటీలో తిరుగుతూ ఫోటోలు తీసుకున్నారు. రిషికేష్‌లో అంత జాలీగా ఉన్న ఇద్దరు.. అసలు ముస్సోరీకి ఎందుకెళ్లారు?. ముస్సోరీలో ఏం జరిగింది?. ఇదే తేల్చాలని పట్టబుడుతున్నారు గాయత్రి పేరెంట్స్‌.,

కూతురు మరణంపై న్యాయం కోసం పోరాటం

ముస్సోరీలోనే ఉన్న విశాఖ టెకీ రాధా గాయత్రి తండ్రి సుధాకర్.. కూతురు మరణంపై న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. డెహ్రాడూన్‌లోనే ఉన్న సుధాకర్.. రాధా గాయత్రి మృతి, మృతదేహం తరలింపుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 11అంశాలతో అనుమానాలు వ్యక్తం చేస్తూ డెహ్రాడూన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్సోరీకి వెళ్తున్నట్టు తమకు తెలియదని.. హరిద్వార్, రిషికేశ్ వెళ్తున్నట్లు మాత్రమే చెప్పారని తెలిపారు. ఇప్పటికే శ్రీ చరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే.. భర్తపైనే అనుమానాలు ఉన్నాయంటూ గాయత్రి తండ్రి సుధాకర్ పేర్కొన్నారు. గాయత్రీకి మత్తు ఇచ్చి ఉండవచ్చని.. శ్రీచరణ్ ఆర్థిక లావాదేవీలు, హోటల్‌లో సీసీ ఫుటేజీ పరిశీలించాలని విన్నవించారు. ఈ మేరకు రేపు పోలీసు ఉన్నతాధికారులు, ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఉంది.

రెడ్‌ వైన్‌ తాగి నిద్రపోయాం: భర్త శ్రీ చరన్ ఏమన్నారంటే..

ఇదిలాఉంటే.. రాధా గాయత్రి తాను ప్రేమించే భార్య అని, ఆమెను తాను చంపలేదని భర్త శ్రీచరణ్‌ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. పెళ్లయిన కొత్తలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, ఆ తర్వాతనుంచి ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామన్నారు. ఈ క్రమంలోనే..షార్ట్‌ ట్రిప్‌ ప్లాన్‌చేసుకున్నామని.. ఈ నెల 13న రిషికేశ్‌ వెళ్లామన్నారు. రాత్రి 11.30 గంటలకు ముస్సోరిలోని హోమ్‌స్టేకి చేరామని.. అక్కడ ఇచ్చిన రెడ్‌ వైన్‌ తాగి నిద్రపోయామని తెలిపారు. ఉదయం 6 గంటలకు లేచిచూస్తే, ఆమె తనపై పడుకొని ఉందని.. ముక్కు నుంచి రక్తం కారుతోందన్నారు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌చేసి, హోటల్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చానన్నారు. పోలీసులు, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఆధారాలు సేకరించారని.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్లారన్నారు… తర్వాత మృతదేహాన్ని విశాఖపట్నం, ఇక్కడి నుంచి మామిడిపల్లి వెళ్లాం అని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us