
విశాఖపట్నం సాగర్నగర్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. లాడ్జిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని శాంతికుమారిగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శాంతికుమారి తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ ఎక్కడ జరిగింది? అక్కడి నుంచి ఆమె లాడ్జికి ఎలా చేరుకుంది? అనే అంశాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. పార్టీ అనంతరం లాడ్జికి ఎందుకు వెళ్లింది? ఎవరి వెంట వెళ్లింది? అన్న ప్రశ్నలు ఈ కేసులో కీలకంగా మారాయి.
లాడ్జిలో అనుమానాస్పద పరిస్థితుల్లో శాంతికుమారి మృతి చెందడంతో.. ఇది సహజ మరణమా? లేక హత్యనా? అనే దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా రికార్డులు సేకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. శాంతికుమారి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్యేనని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తెను ఎవరో ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని బంధువులు ఆరోపించడం కేసును మరింత సీరియస్గా మార్చింది.
ఈ నేపథ్యంలో అరిలోవ పోలీసులు ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పార్టీకి హాజరైన వారిని, శాంతికుమారితో చివరిగా మాట్లాడిన వ్యక్తులను గుర్తించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో అసలు నిజం ఏంటి? శాంతికుమారి మరణానికి కారణం ఏమిటి? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన విశాఖలో హాట్ టాపిక్గా మారింది.