
వేసవి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. విద్యాసంస్థలకు వేసవి సెలవులు కావడంతో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళుతున్నారు. దీంతో తిరుమలలో విపరీతంగా భక్తుల రద్దీ ఉండగా.. టీటీడీ వేగంగా దర్శనాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. సామాన్య భక్తుల దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అలాగే ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు ఇటీవల అభిషేక సేవ సమయంలో కూడా భక్తులను దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలో కూడా సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. తిరుమలలో రద్దీ పెరుగుతున్న వేళ ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. ఈ వారం శ్రీవారి తోమాల సేవ సమయంలో 1200 మంది భక్తులను దర్శనాలకు టీటీడీ అధికారులు అనుమతించనున్నారు. గత వారంలో శ్రీవారి అభిషేక సేవ సమయంలో 5850 మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దీతో గత శుక్రవారం ఏకంగా 87,689 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరిత్రలో శుక్రవారం ఎక్కువమంది దర్శించుకోవడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీకి తగ్గట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లు, కొండపై భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా సకల ఏర్పాట్లు చేసింది. త్రాగునీరు, ఆహారం, గదులు అందుబాటులో ఉండేలా చూస్తోంది.