
పెళ్లి కావడం లేదనే తీవ్ర మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తిరుచానూరుకు చెందిన దాక్షాయిని అనే యువతి బుధవారం ఉదయం హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకుంది. అయితే ఉన్నట్లుండి గది లోపల ఇంజన్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఇది గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి.. దాక్షాయిని 80శాతం వరకు కాలిపోయి ఉంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రూయా మార్చురీకి తరలించారు. ఆమెకు వివాహం కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజంగా పెళ్లి కాకపోవడం వల్లే చనిపోయిందా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లిపీటలపై కూర్చోవలసిన కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.