
ఏలూరు: ప్రకృతి సృష్టిలో ప్రతి జీవికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా మనకు నల్ల చీమలు, ఎర్ర చీమలు పరిచయమే అయినప్పటికీ, చెట్లను కంటికి రెప్పలా కాపాడే ‘రాణి నేత చీమలు’ (గ్రీన్ ట్రీ యాంట్స్ , వీవర్ యాంట్స్) ప్రస్తుతం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏలూరు జిల్లా కుక్కునూరు ప్రాంతంలో ఈ అరుదైన ఆకుపచ్చ చీమలు పచ్చని చెట్లపై సందడి చేస్తూ ప్రత్యక్షమయ్యాయి. సాధారణంగా ఈ జాతి చీమలు నారింజ లేదా పసుపు-గోధుమ రంగుల్లో దర్శనమిస్తుంటాయి. అయితే, వీటిలో సంతానోత్పత్తి దశకు చేరుకున్న కీటకాలు తమ శరీర వర్ణాన్ని ఆకుపచ్చగా మార్చుకుంటాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు మార్పు వల్ల అవి చెట్ల ఆకుల్లో సులువుగా కలిసిపోయి శత్రువుల బారి నుండి రక్షణ పొందుతాయి.
ఈ నేత చీమల జీవనశైలి, గూడు కట్టుకునే విధానం అత్యంత విలక్షణమైనది. చెట్లపై నివసించే ఈ కీటకాలు, పచ్చని ఆకులను ఒకదానికి ఒకటి దగ్గరగా చేర్చి, తమ లార్వాల నుంచి స్రవించే ఒక రకమైన ప్రత్యేక ద్రవంతో వాటిని అతుకు పెడతాయి. ఎంతో నైపుణ్యంతో ఆకులను కుట్టినట్లుగా గూళ్లను నిర్మించుకోవడం వల్లే వీటికి ‘వీవర్ యాంట్స్’ అనే పేరు వచ్చింది. ఇలా చెట్లపై ఏర్పాటు చేసుకునే ఒక్కో గూటిలో వేలాది సంఖ్యలో చీమలు నివసిస్తుంటాయి. స్వభావరీత్యా ఇవి అత్యంత దూకుడుగా వ్యవహరిస్తాయి. తాము నివసించే చెట్లపైకి పక్షులు కానీ, ఇతర జంతువులు లేదా మనుషులు కానీ వస్తే.. ఇవి సమూహంగా దాడి చేసి కుడుతాయి.
తోటల్లోని హానికరమైన కీటకాలను, పురుగులను ఆహారంగా తీసుకుంటూ చెట్లకు ఒక రకమైన సహజ సిద్ధమైన ‘బాడీగార్డులు’గా ఇవి సేవలు అందిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏలూరు జిల్లాలో మొదటి సారి పెద్ద ఎత్తున ఈ తరహా చీమలు కనిపిస్తుండటం తో స్థానికంగా లజడి రేగింది. స్థానిక గిరిజనులు ఎక్కువగా పుల్లల కోసం అటవీ ఉత్పత్తులకోసం అడవుల్లోకి వెలుతుంటారు. ఇటివల కాలంలో యాసిడ్ పురుగుల కల కలం సృష్టిస్తున్న నేపద్య్మలో తాజాగా ఈ చీమల సంచారంపై కొందు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..