
విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నరసరావుపేట నుంచి విజయవాడ వచ్చిన ఓ బస్సులో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ప్రయాణికుల బ్యాగులు తారుమారు కావడంతో ఈ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న ఒక బ్యాగులో ఏకంగా 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు లభ్యమవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
తారుమారైన బ్యాగ్, వెలుగులోకి వ్యవహారం
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఆసిఫ్ అలీ అనే ప్రయాణికుడు నరసరావుపేట నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించాడు. అయితే, ప్రయాణం ముగిశాక అతడి బ్యాగ్ బదులు మరొకరి బ్యాగ్ అతడికి వచ్చింది. ఆ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో భారీగా జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కనిపించాయి. వాటిని చూసి తీవ్ర కంగారుకు గురైన ఆసిఫ్ అలీ, వెంటనే పోలీసులను ఆశ్రయించి సమాచారం అందించాడు.
అసలు సూత్రధారి కోసం గాలింపు
ఆసిఫ్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఆ బ్యాగ్ ఎవరిది? అసలు సూత్రధారి ఎవరు? అనే వివరాలను సేకరించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో తారుమారైన ఈ బ్యాగ్ ప్రస్తుతం పోలీసులకు పెద్ద చిక్కుముడిగా మారింది.
ఇది కేవలం ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా సాగిస్తున్న పేలుడు పదార్థాల రవాణానా? లేక దీని వెనుక ఏదైనా కుట్రపూరిత పన్నాగం దాగి ఉందా? అనే కోణాల్లో పోలీసులు లోతుగా కూపీ లాగుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.