Chittoor: దున్నపోతుకు పోలీసుల కాపలా.. చిత్తూరులో అరుదైన ఘటన

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లిలో గ్రామ జాతర సందర్భంగా దున్నపోతు బలిని అధికారులు అడ్డుకున్నారు. గ్రామస్థులు రూ.50 వేలతో కొనుగోలు చేసిన దున్నపోతును బలి ఇవ్వాలని సిద్ధం కాగా, ముగ్గురు యువకులు కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, పోలీసులు రాత్రంతా కాపలా ఉండి జంతుబలి జరగకుండా చర్యలు చేపట్టారు.

Chittoor: దున్నపోతుకు పోలీసుల కాపలా.. చిత్తూరులో అరుదైన ఘటన
Animal Sacrifice

Edited By:

Updated on: Jun 18, 2026 | 8:20 PM

చిత్తూరు జిల్లాలో ఓ దున్నపోతుకు పోలీసుల కాపలా అవసరమైన అరుదైన ఘటన చోటుచేసుకుంది. పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో గ్రామ జాతర సందర్భంగా జంతుబలి ఇవ్వకుండా అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలోని అమ్మవారి జాతరను నిర్వహించేందుకు గ్రామ పెద్దలు పండితులను సంప్రదించి ముహూర్తం నిర్ణయించారు. జాతరలో భాగంగా దున్నపోతును బలి ఇవ్వాలని నిర్ణయించి, గ్రామస్థులు కలిసి రూ.50 వేలతో దున్నపోతును కొనుగోలు చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు జంతుబలిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దున్నపోతు ఫొటోలతో పాటు కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర అధికారులు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పూతలపట్టు తహసీల్దార్ ఉదయ సతీష్ గ్రామానికి చేరుకుని జంతుబలి జరగకుండా చర్యలు చేపట్టారు. అదే సమయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాలతో పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.

దున్నపోతును కట్టిన ప్రాంతంలో అధికారులు, పోలీసులు రాత్రంతా కాపలా ఉండటంతో జంతుబలి జరగకుండా అడ్డుకోగలిగారు. గ్రామస్థులు సుమారు 40 ఏళ్ల తర్వాత గ్రామ శ్రేయస్సు కోసం ఈ బలి ఇవ్వాలని భావించినప్పటికీ, అధికారుల జోక్యంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. అనంతరం గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో కుంభం ఏర్పాటు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జాతర పూర్తయ్యే వరకు పోలీసులు గ్రామంలోనే బందోబస్తు నిర్వహించి ఎలాంటి జంతుబలి జరగకుండా పర్యవేక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us