Pawan Kalyan: వివాదాస్పదంగా మారిన స్కూల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల పుస్తకాల పంపిణీ.. దర్యాప్తు షురూ..!
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం ప్రాథమిక పాఠశాలలో పవన్ పుట్టినరోజునాడు జరిగిన పుస్తకాల
Pawan kalyan Fans – West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తల్లాపురం ప్రాథమిక పాఠశాలలో పవన్ పుట్టినరోజునాడు జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా టర్న్ తీసుకుంది. స్కూల్ లో జరిగిన ఈ వేడుకల వీడియో వైరల్ అయింది. పాఠశాల విద్యార్థులతో జనసేన జెండా పట్టించి పిల్లలతో నినాదాలు చేయించడంపై ఎంఈఓ హనుమ విచారణ చేపట్టారు.
ఈ నెల 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సదరు పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు పవన్ అభిమానులు. విద్యార్థులతో హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని నినాదాలు చేయించడంపై ఫిర్యాదు రావటంతో ఇప్పుడు ఎంఈవో విచారణ చేపట్టారు. అయితే, దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి నియమ నిబంధనలు వైసీపీ నేతలకు ఎందుకు వర్తించడం లేదని నిలదీస్తున్నారు.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇటీవల జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణం విషయం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో జనసేన పార్టీ జెండా స్థూపం నిర్మాణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా వారే కావాలని అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ స్థూపం ప్రారంభం చేయాలనుకున్న జనసేన నేతలకు పోలీసుల చర్యతో ఆటంకం ఏర్పడింది. కాటకూటేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జనసేన స్తూపం నిర్మాణ పనుల్లో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలను అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టారంటూ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్అండ్బి, పంచాయతీ అధికారులు జనసేన పార్టీ జెండా స్థూప నిర్మాణాన్ని నిలిపివేశారు.
దీంతో అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో జనసేన స్తూపాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలో దిగారని జనసేన కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా స్థూపాలకి ఎలా అనుమతులు ఉన్నాయో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Read also: Korukonda: నేడు సైనిక్ స్కూల్ లో ఘనంగా జరగనున్న స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు. ఎందుకంటే..!