Nellore: ఇలా ఉన్నావేంట్రా.! బస్టాండ్‌లో ఆపి ఛాయ్‌కి వెళ్లిన డ్రైవర్.. తిరిగి వచ్చి చూసేసరికి..

బైకులు, కార్లు దొంగతనం చేయడం మీరూ చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఓ దొంగ ఏకంగా.. అమ్మబాబోయ్.. దొంగతనం ఏం చేశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ఆ వివరాలు ఏంటి.? ఈ స్టోరీలో చూసేద్దాం ఓసారి లుక్కేయండి మరి.

Nellore: ఇలా ఉన్నావేంట్రా.! బస్టాండ్‌లో ఆపి ఛాయ్‌కి వెళ్లిన డ్రైవర్.. తిరిగి వచ్చి చూసేసరికి..
Nellore

Edited By: Ravi Kiran

Updated on: Jul 24, 2025 | 1:55 PM

ఇంటి బయట, బజారు, ఆఫీసుల వద్ద వాహనాలు చోరీకి గురైన సందర్భాలు తరచూ వింటూ ఉంటాం. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, కార్లు చోరికి గురవుతుంటాయి. లారీలు, భారీ వాహనాలు చోరీ ఘటనలు అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సునే తస్కరించి తీసుకుని వెళ్ళిపోయాడు. మరికాసేపట్లో బస్సు గమ్యస్థానానికి బయలుదేరాల్సి ఉండగా.. బస్టాండ్‌కు చేరుకున్న డ్రైవర్‌కు అక్కడ బస్సు లేకపోవడం చూసి షాక్ అయ్యాడు. ఎక్కడా అని పరిశీలించగా.. బస్సు చోరీకి గురైన విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంగణంలో ముందు రోజు రాత్రి పార్కు చేసిన ఆర్టీసీ బస్సు చోరీకి గురైన విషయాన్ని ఉన్నతాధికారులకు డ్రైవర్ తెలియజేయడంతో ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ ప్రారంభించిన టూ టౌన్ పోలీసులు నెల్లూరు వ్యాప్తంగా పోలీస్ వాకీ టాకీ సెట్ ద్వారా సమాచారం అందించారు. అలాగే జీపీఎస్ ట్రాకింగ్ చేసి బస్సు ఎక్కడికి వెళుతోందన్న సమాచారం కూడా తెలుసుకున్నారు. ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరులో నైట్ హాల్ట్ ఉండి ఉదయం ఐదున్నరకు నెల్లూరు నుంచి ఆత్మకూరు బయలుదేరి వెళ్లాల్సి ఉంది.

రాత్రి బస్టాండ్ ప్రాంగణంలో పార్క్ చేసి.. తిరిగి వచ్చి చూడగా బస్సు లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు డ్రైవర్. అయితే బస్సు మూడున్నరకు చోరీకి గురైనట్టు పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా చౌకచర్ల గ్రామానికి చెందిన బిట్రగుంట కృష్ణ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. నెల్లూరులో బస్సును దొంగతనం చేసి అతను డ్రైవ్ చేసుకుని ఆత్మకూరు వైపు వెళుతున్నట్టు గుర్తించారు. ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాలెం వద్ద పోలీసులు బస్సును ఆపి అతనిని అదుపులోకి తీసుకున్నారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తి మానసిక పరిస్థితి బాగా లేనట్టు పోలీసులు గుర్తించారు.

గతంలో నెల్లూరు ఆర్టీసీ గ్యారేజీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసిన కృష్ణ.. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా బస్సు చోరీ కూడా మానసిక పరిస్థితి బాగాలేకని ఈ విధంగా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి పాల్పడ్డ బిట్రగుంట కృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి