
బుల్లెట్ బైక్ కొనాలన్నది చిన్నప్పటి నుంచి అతని కోరిక.. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కలను ఎప్పటికప్పుడు దూరం చేస్తూనే వచ్చాయి. అయితే ఎలాగైనా సరే ఆ బండిని దక్కించుకోవాలనుకున్నాడు.. అది కూడా అందరిలా నోట్లు ఇచ్చి కాదు, ఎవరూ ఊహించని విధంగా డిఫరెంట్గా కొనాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా మూడేళ్ల పాటు కష్టపడి, ఏకంగా 3 లక్షల రూపాయల విలువైన 10 రూపాయల కాయిన్స్ను పోగు చేశాడు. చివరికి ఆ కాయిన్స్ అన్నింటినీ లగేజీ వాహనంలో షోరూమ్కు తరలించి, తన డ్రీమ్ బైక్ను సొంతం చేసుకున్నాడు. బాపట్ల జిల్లాలో జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
బాపట్ల జిల్లా పాతచీరాలకు చెందిన రాసాని రాఘవ ఓ చేపల వ్యాపారి. గత కొంత కాలంగా బుల్లెట్ బైక్ కొనాలనే ఆశ ఆర్ధిక ఇబ్బందుల వల్ల సాకారం కాలేదు. తనకు ఇష్టమైన బైక్ను అందరిలా కాకుండా కొంత డిఫరెంట్గా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకు పది రూపాయల కాయిన్స్ను సేకరించి వాటితో బుల్లెట్ బండి కొనాలనుకున్నాడు. వెంటనే ఆచరణలో పెట్టి పది రూపాయల కాయిన్స్ను మూడు సంవత్సరాల పాటు సేకరించి భద్రపరిచాడు. ఇలా వ్యాపారంలో వచ్చిన డబ్బుల్లో 10 రూపాయల కాయిన్స్ను సపరేట్గా ఇంట్లో ఉంచాడు. మొత్తం 30 వేల కాయిన్స్ లెక్కబెట్టి 300 ప్యాకెట్లుగా స్నేహితులు, కుటుంబ సభ్యుల సహాయంతో గ్రేడింగ్ చేశాడు. ఇక 220 కేజీల బరువు ఉన్న కాయిన్స్ని చివరికి లగేజీ వాహనం ద్వారా ఒంగోలుకు తీసుకెళ్లి..తమకు నచ్చిన బుల్లెట్ బైక్ కొన్నాడు. మొదటి 10 రూపాయల కాయిన్స్ చూసి ఆశ్చర్యపోయిన షోరూం సిబ్బంది, కాయిన్స్తో బైక్ కొనాలనే రాఘవ పట్టుదల చూసి ప్రశంసలు కురిపించారు. ఇంటికి చేరిన బుల్లెట్ చూసిన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.