
రాయి రాయి అన్నది ఒకనాటికి రత్నమవునురా. బంగారం లాంటి ఈ మాట ఇప్పుడు రాయలసీమలో బంగారం ఉత్పత్తికి బాటలేసింది. ఇన్నాళ్లు నెర్రలు బాసిన నేలలో ఇప్పుడు ఇక కనకధారే. అవును.. కరువుకు కేరాఫ్గా నిలిచిన కర్నూలు సీమ ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్కు సిరుల సిగ కాబోతోంది. కర్నాటక గోల్డ్ ఫీల్డ్ను మించి తుగ్గలి మండలంలో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్లో భారీ మైనింగ్కు రంగం సిద్ధమైంది. దేశంలోనే మొట్ట మొదటి అతిపెద్ద ప్రవేటు గోల్డ్ మైన్గా కర్నూలు రికార్డు క్రియేట్ చేయబోతుంది. తుగ్గలి మండలం బొల్లవానిపల్లి గ్రామంలో గోల్డ్ మైనింగ్ ప్రారంభిస్తున్నట్టు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఆకాశన్నంటుతున్న వేళ డెఫినెట్గా ఇది బంగారంలాంటి మాటే. స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు దేశంలో అతిపెద్ద ఫస్ట్ ప్రయివేటు గోల్డ్ మైన్ ఇదే.
వానొస్తే కర్నూలు జిల్లా తుగ్గలి, పగిడిరాయి, తుగ్గలి, జొన్నగిరి సహా చుట్టుపక్కల గ్రామాల్లో వజ్రాలవేట జోరుగా సాగేది. అంతేకాదు నెర్రలు బాసిన ఈ నేలలో బంగారు నిక్షేపాలున్నాయని పరిశోధనల్లో తేలింది. అలా తుగ్గలి మండలం బొల్లవానిపల్లి గ్రామం దగ్గర జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. బంగారం, వెండి వంటి ఖనిజాల వెలికితీతలో ఎంతో అనుభవం వున్న త్రివేణి త్రివేణి ఎర్త్ మూవర్స్, లాయ్లాడ్స్ మెటల్ అండ్ ఎనర్జీ లిమిటెడ్, దక్కన్ గోల్డ్ మైన్స్ భాగస్వామ్యంతో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ రాయలసీమలో సువర్ణ శకానికి తెరలేచింది.
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 70 శాతంతో ప్రధాన వాటాదారులైన త్రివేణి సంస్థ ఎండీ ప్రభాకరన్ … జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ త్వరలో మైనింగ్ చేపడుతామని ప్రకటించారు. ఏడాదికి 500 కేజీల ఉత్పత్తి లక్ష్యంగా త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఏటా టన్ను బంగారం ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్దంచేసినట్టు చెప్పారాయన. భవిష్యత్తులో ఇక్కడ బంగారం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత కొత్తగా నిర్మించిన ప్లాంట్లో ట్రయల్ రన్ కొనసాగుతుందన్నారు. భారత్ ఆత్మనిర్భర్ సంకల్పానికి జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ బాసటగా నిలుస్తుందన్నారు. బంగారం ఉత్పత్తితో పాటు సామాజిక బాధ్యతగా పరిసర గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తామ ప్రాజెక్ట్ చేయూతనిస్తుందన్నారు ప్రభాకరన్. భూములిచ్చిన రైతు కుటుంబాలకు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..