
ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశముంది. ఎండ తీవ్రత కొనసాగనుండగా.. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఏపీ విషయానికొస్తే.. కడప, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉంటుందని, ఆ తర్వాత వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అయితే అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోతున్నారు.
భానుడి ఉగ్రరూపం క్రమంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వాతారణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని స్పష్టం చేసింది. మరోవైపు వర్షాలు పడే సమయంలో విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని సూచించింది. ఇక ఏపీలోని పలు జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటీవల పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు.
నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఆలస్యంగా తెలంగాణను తాకనున్నాయని, జూన్ 5 తర్వాత రాష్ట్రాన్ని తాకుతాయని తెలిపింది. ఎల్నీవో ప్రభావం వల్ల నైరుతి కదరికల్లో వేగం తగ్గిందని, వాతావరణ పరిస్థితుల వల్ల ఈ సారి ఆలస్యంగా తాకుతాయని తెలిపింది. మే 25వ తేదీన సౌత్ ఇండియాను రుతుపవనాలు తాకుతాయని ముందుగా వాతావరణశాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడు వేగం నెమ్మదించింది. దీంతో ఈసారి తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా మొదలుకానుంది. జూన్ 5 నుంచి 10 మధ్య రుతుపవనాలు తాకనున్నాయని తెలుస్తోంది. రుతుపవనాలు తాకితే రాష్ట్రంలో భారీగా వర్షాలు కురవనన్నాయి. ఆ తర్వాత ఎండ ప్రభావం తగ్గనుంది. ఇక రాష్ట్రంలో రాబోయే మూడ్రోజుల పాటు ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు మంచి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధ, గురువారాల్లో సైతం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.