Andhra: గుడ్ న్యూస్.. ఏపీలో వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికులకు ఏప్రిల్ 1 నుండి ఉచిత విద్యుత్ అందించనుంది. హ్యాండ్లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

Andhra: గుడ్ న్యూస్.. ఏపీలో వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
Andhra Government

Updated on: Mar 23, 2026 | 1:05 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత, మరమగ్గ కార్మికుల సంక్షేమం, ఆర్థిక బలోపేతం కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సవిత తెలిపారు. ఇందులో భాగంగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ పథకం కింద హ్యాండ్లూమ్ కార్మికులకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ (మరమగ్గ) కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు.

విజయవాడలో జరుగుతున్న గాంధీ బునకర్ మేళా, జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2026ను మంత్రి సవిత, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్.. చేనేతలు పడుతున్న కష్టాలను పూర్తిగా అర్థం చేసుకున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు 50 సంవత్సరాలకే రూ. 4,000 పింఛను అందజేస్తున్నామని, దానితోపాటు ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేనేతలను ప్రోత్సహించడానికి ప్రతి పండుగకు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోందని, సబ్సిడీలు ఇస్తోందని వివరించారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి, చేనేత కళాకారులను ప్రోత్సహించవలసిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

బీసీలలో భాగమైన చేనేతలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి నొక్కి చెప్పారు. మహాత్మా గాంధీ గారు కలలు కన్న భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పనలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని మంత్రి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోందని, వారికి అవసరమైన రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మార్కెటింగ్ వంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని ఆమె తెలిపారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేనేత ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయగలగుతున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు.

Also Read: ఏపీలో మధ్యాహ్నం 3 దాటిన తర్వాత వర్షాలు.. ఒకటి, రెండ్రోజులు కాదు..

Follow Us