‘తనను ఉండకుండా చేయాలన్నది కూటమి లక్ష్యం..’ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం.
ఎన్నికలు సరిగా జరుగుతాయన్న నమ్మకం తగ్గుతోందని, కూటమి నేతలు తనపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం జగన్ సంచలన కామెంట్లు చేశారు. పథకాల నిధులు పేదలకు చేరకుండా ఆపుతున్నారని ఆయన ఆరోపించారు. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేస్తున్నారని, తనను ఉండకుండా చేయాలన్నదే కూటమి లక్ష్యమన్నారు సీఎం. ఇప్పుడు ఈ కామెంట్లు ఏపీలో కాక రేపుతున్నాయి. ప్రచారం హీటును నెక్ట్స్ లెవెల్కు తీసుకుని వెళ్లాయి. ఇవాళ మూడు సభలతో జగన్ దూకుడు పెంచారు. రేపల్లెతో మొదలు పెట్టారు. మాచర్లతో వేడి పెంచారు. సాగర తీరం..మచిలీపట్నంలో ముగించారు. జగన్ సభలకు జనం పోటెత్తారు.
సీఎం జగన్ రోడ్షోలు, సభలు, బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. తాజాగా రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో జరిగిన జగన్ సభలకు జనం భారీగా తరలివచ్చారు. జగన్ తన ప్రసంగాల్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగిస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు అందాయా లేదా.. అభివృద్ధి జరిగిందా లేదా.. పేదల కుటుంబాలకు మంచి జరిగిందా లేదా అంటూ ప్రజల నుంచే సమాధానం రాబడుతూ.. ప్రజలతో ఇంటర్యాక్ట్ అవుతున్నారు. పబ్లిక్ మీటింగ్కి వచ్చిన వారి నుంచి ఈ తరహా ప్రశ్నలకు భారీ స్పందన వస్తోంది. జగన్కి మద్దతుగా చేతులెత్తి జై కొడుతున్నారు.
బాపట్ల లోక్సభ స్థానం పరిధిలోని రేపల్లెలో తాను తీసుకొచ్చిన సంస్కరణల గురించి మాట్లాడారు జగన్. రాష్ట్రమనే పొలంలో ఈ ఐదేళ్లలో సంస్కరణలనే విత్తనాలు వేశామన్నారు సీఎం. ఈ విత్తనాలన్నీ 15 ఏళ్లలో వృక్షాలు అవుతాయని, తద్వారా ప్రజల జీవితాలు మారుతాయన్నారు. ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పేదరికం మాయం అవుతుందన్నారు జగన్. కొద్ది రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందని, ఇవి పేదల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలన్నారు జగన్. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు.. తస్మాత్ జాగ్రత అంటూ హెచ్చరించారు. చంద్రబాబు పేరు చెబితే…పేదలకు మేలు చేసిన ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని ప్రశ్నించారు జగన్.
మాచర్లలో కూడా జగన్ సభకు జనం భారీగా హాజరయ్యారు. ఈ ఎన్నికలు ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు జగన్. ఇలాంటి సంక్షేమాన్ని గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. జగన్ సభతో…సాగరతీరంలోని మచిలీపట్నం జనసంద్రంగా మారింది. సముద్రంతో పోటీ పడుతూ మచిలీపట్నాన్ని జన సముద్రం ముంచెత్తింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు జగన్. భూమిపై దాని యజమానులకే పూర్తి హక్కులు కల్పించడం ఈ చట్టం ఉద్దేశమని వివరించారు. దీనికోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు జగన్. మూడు సభలతో ప్రచార వేడిని పీక్స్కు తీసుకుని వెళ్లారు జగన్.