
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’కి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. అలాగే పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే ‘స్త్రీ శక్తి’ పధకంపై తాజాగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఘాట్ రోడ్లలో నడిచే ఆర్టీసీ సర్వీసుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళలు గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్సుతో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.