టీడీపీ హయాంలో వారిపై నమోదైన కేసుల ఎత్తివేతకు కమిటీ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

|

Sep 29, 2022 | 9:05 PM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను ఎత్తివేసే విషయమై వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య కాలంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది..

టీడీపీ హయాంలో వారిపై నమోదైన కేసుల ఎత్తివేతకు కమిటీ.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
AP Government
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసులను ఎత్తివేసే విషయమై వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2014-19 మధ్య కాలంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వానికి ఉద్యోగుల నుంచి వినతులు వచ్చాయి. దీంతో ఏసీబీ ట్రాప్ కేసులు కాకుండా మిగతా కేసుల్లో ఉద్యోగులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో ఉద్యోగులపై కక్ష పూరితంగా నమోదైన కేసులపై నిర్ణయం తీసుకునేందుకు హైపవర్ కమిటీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. జీఏడి సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి మెంబెర్ సెక్రటరీ గా మొత్తం ఐదుగురుతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, సంబంధిత శాఖ కార్యదర్శిని నియమించారు. శాఖలవారీగా ఉద్యోగులపై నమోదైన కేసులను పరిశీలించి, వాటి పరిష్కారం పై ఈ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఏవైతే ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు నమోదయ్యాయో అటువంటి కేసుల ఎత్తివేతపై ప్రభుత్వం కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.

అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు లేదా ప్రతిపక్ష పార్టీకి సానుకూలంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్న ఉద్యోగులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న ఉద్యోగులపై అక్రమంగా ఏసీబీ కేసులు బనాయించారని గతంలో వైసీపీ ఆరోపించింది. అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులపై అక్రమంగా ఆరోపణలు బనాయించి, కేసులతో వేధిస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇలా రెండు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శించుకోవడం ఇటీవల సర్వసధారణం అయింది. పార్టీలు తమ రాజకీయాల కోసం ఉద్యోగులను సైతం వాడుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి ఎవరైనా అధికారులు వ్యతిరేకంగా ఉంటే వారిపై కక్షపూరిత చర్యలకు దిగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షాల విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు అలా చేయలేదా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు అధికార పార్టీ నాయకులు.

ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు వచ్చినప్పుడు వాటికి సమాధానానికి బదులు గతంలో మీరు చేయలేదా అంటే తిరిగి ప్రశ్నించడం ఇప్పటి రాజకీయాల్లో సాధారణం అయిపోయింది. దీంతో ఉద్యోగులు కూడా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటే తమకు ఓ ఐదేళ్లు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనకు ఉద్యోగులు వచ్చేస్తున్నారు. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ వైపు ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. దీంతో అధికారుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎవరూ అధికారంలో ఉన్న న్యూట్రల్ గా ఉంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు, రాజకీయ నాయకులు చెప్పినట్లుగా వింటూ, వారు ప్రతిపాదించిన వ్యక్తులకే లబ్ధి చూకూర్చేలా పనిచేయడం పై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు అధికారులు తాపత్రయ పడుతుంటం కూడా అనేక విమర్శలకు దారితీస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉద్యోగులపై ఏసీబీ ట్రాప్ లేకుండా నమోదు చేసిన ఏసీబీ కేసులను పరిశీలించి, వాటిలో అక్రమంగా బనాయించిన వాటిని ఎత్తివేయడానికి కమిటీ నియమించడం ఏపీ రాజకీయాల్లో హట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..