
భక్తికి, ప్రకృతికి నిలయమైన సింగరకొండ పుణ్యక్షేత్రం ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అద్దంకి - నార్కెట్పల్లి స్టేట్ హైవే పక్కనే ఉన్న ఈ క్షేత్రం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే మూడవ అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.

ప్రకాశంజిల్లా అద్దంకి మండలం సింగరకొండ క్షేత్రం లోపలికి వెళ్లే ప్రధాన ప్రవేశ ద్వారం (Entrance) దగ్గరే సుమారు 99 అడుగుల ఎత్తుతో ఆకాశమే హద్దుగా నిలబడిన ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులకు కనువిందు చేస్తోంది. హైవేపై వెళ్లే వాహనాలు ఈ విగ్రహం దగ్గర ఆగి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. హైవేపై ప్రయాణించే ప్రయాణికులకు సుదూరం నుంచే కనిపిస్తూ భక్తిభావం కలిగిస్తోంది.

కొండపై నరసింహుడు.. కొండ కింద ఆంజనేయుడు... ఈ క్షేత్ర విశేషాల విషయానికి వస్తే... శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు క్షేత్రపాలకుడిగా కొండపైన కొలువై ఉండగా, కొండ దిగువన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా వెలిశారు. ఆలయానికి సమీపంలోనే పురాతనమైన భవనాసి తటాకం (చెరువు) క్షేత్రానికి మరింత ప్రకృతి సౌందర్యాన్ని ఇస్తోంది.

హైవే ప్రయాణికుల నమ్మకం.. వాహన పూజలు: నార్కెట్పల్లి - మేదరమెట్ల రాష్ట్ర రహదారిపై ప్రయాణించే వారు, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఇక్కడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ హైవేలో ప్రయాణించే వేలాది వాహనదారులు, స్వామి వారి కృప కోసం ఈ గుడి వద్ద వాహన పూజలు చేయించుకోవడాన్ని ఒక ఆనవాయితీగా మార్చుకున్నారు.

ఇక్కడ పూజ చేయించుకుంటే ప్రయాణాలు క్షేమంగా సాగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి ఒడిలో, భవనాసి తటాకం సమీపంలో, ఆధ్యాత్మిక వెలుగులు చిమ్ముతున్న సింగరకొండ క్షేత్రం ఇప్పుడు జిల్లాలోనే ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.