
అమెరికాలో విచిత్రం చోటుచేసుకుంది. చనిపోయిన అభ్యర్థి ఎన్నికల్లో విజేతగా నిలిచాడు. నార్త్ డకోటాకు చెందిన 55 ఏళ్ల రిపబ్లికన్ నేత డేవిడ్ అందల్ అక్టోబర్ 5వ తేదీన కరోనా బారినపడి మరణించారు. కానీ, ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన విజయం సాధించారు. కరోనా వైరస్ సోకిన డేవిడ్ హాస్పిటల్లో నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత మరణించారు. కొవిడ్-19తో మృతి చెందిన నెల రోజుల తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇవాళ ప్రకటించిన ఫలితాల్లో డేవిడ్ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. నార్త్ డకోటాలోని బిస్మార్క్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ తరపున డేవిడ్ అందల్, డేవ్ నెహరింగ్లు పోటీపడ్డారు. ఈ జిల్లాలో ప్రజలు ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకుంటారు. అందల్కు 35 శాతం ఓట్లు పోలైనట్లు సమాచారం. అయితే, రైతులకు, బొగ్గు పరిశ్రమకు ఎంతో సేవ చేయాలని డేవిడ్ తపించినట్లు ఆయన తల్లి వెల్లడించింది. వాస్తవానికి ఇప్పుడు నార్త్ డకోటాలో అత్యధిక కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.