
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించగా, ఈ యుద్ధం ప్రారంభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధం ఎలా, ఎందుకు ప్రారంభమైందనే దానిపై మరిన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. టెన్నెస్సీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, సైనిక చర్యకు అనుకూలంగా మాట్లాడిన మొదటి వ్యక్తి తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవడం అవసరమని హెగ్సెత్ సూచించడంతోనే యుద్ధం చేయాల్సి వచ్చిందన్నట్లు ట్రంప్ అన్నారు.
రోలింగ్ స్టోన్ కథనం ప్రకారం, ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ అప్పటికే దాడికి సిద్ధమవుతోందని, అందుకే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కొందరు అంటుండగా, ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసేందుకు దగ్గరలో ఉందని మరికొందరు అంటున్నారు. ట్రంప్ తన మాటల్లోనే, తాను పలువురు అధికారులతో మాట్లాడి, ఆ తర్వాత ఆ సమస్యను విస్మరించడమో, దాన్ని నిర్మూలించడానికి ప్రత్యక్ష చర్య తీసుకోవడమో చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ పరిస్థితి అంత స్పష్టంగా లేదు. ఇరాన్ ప్రతీకారం ఆకస్మికంగా జరిగిందని, దానిని ఎవరూ ఊహించలేదని స్వయంగా ట్రంప్ ఒప్పుకున్నారు. అయితే, ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వాటిని పట్టించుకోలేదని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
Trump on Hegseth on the decision to start military campaign: "Pete, I think you were the first one to speak up. You said, 'Let's do it.'" pic.twitter.com/av8Mk9K6Bo
— Open Source Intel (@Osint613) March 23, 2026
ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ అత్యంత ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. ఇరాన్ క్షిపణి, డ్రోన్, నౌకాదళ సామర్థ్యాలను బలహీనపరచడమే అమెరికా లక్ష్యమని ఆయన పెంటగాన్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు ముగుస్తుందో అంచనా వేయడం కష్టమని, అయితే పనులు ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ యుద్ధం పట్ల ఉత్సాహంగా లేరని డోనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే ఆయన బహిరంగంగా దానిని వ్యతిరేకించలేదు. ఇజ్రాయెల్ ప్రదాని బెంజమిన్ నెతన్యాహు తోసహా మరికొందరు సైనిక చర్యకు అనుకూలంగా ఉండగా, ప్రభుత్వంలోని ఇతరులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంతలో, ఈ వివాదం మధ్య జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం మాజీ అధిపతి జో కెంట్ రాజీనామా చేయడంతో మరో పెద్ద సమస్య తలెత్తింది.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, తాను ఇరాన్తో ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ కూడా పేర్కొన్నారు. తన అల్లుడు జారెడ్ కుష్నర్, రాయబారి స్టీవ్ విట్కాఫ్లు ఒక సీనియర్ ఇరాన్ నాయకుడితో మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇరాన్ అటువంటి చర్చలను ఖండించింది. ట్రంప్ గతంలో తన షరతులకు అంగీకరించడానికి ఇరాన్కు సోమవారం వరకు గడువు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ గడువును ఐదు రోజులు పొడిగించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..