అమెరికా – ఇరాన్‌ మధ్య శాంతి చర్చల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. కొత్త మెలిక పెట్టిన ఇరాన్

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ముందు మరోసారి కొత్త షరతులు ముందు పెట్టింది ఇరాన్‌. ముఖ్యంగా నాలుగు షరతులపై రాజీ లేదని ఇరాన్‌ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఈ షరతులు కూడా ముఖ్యమే అని వెల్లడించింది.

అమెరికా - ఇరాన్‌ మధ్య శాంతి చర్చల్లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. కొత్త మెలిక పెట్టిన ఇరాన్
Us Iran Islamabad Talks

Updated on: Apr 11, 2026 | 9:22 PM

పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ముందు మరోసారి కొత్త షరతులు ముందు పెట్టింది ఇరాన్‌. ముఖ్యంగా నాలుగు షరతులపై రాజీ లేదని ఇరాన్‌ ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఈ షరతులు కూడా ముఖ్యమే అని వెల్లడించింది. ఇక అమెరికా, ఇరాన్‌ ప్రతినిధి బృందాలకు విందు ఏర్పాటు చేశారు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని తెలిపారు.

హర్మూజ్‌ జలసంధిపై తమ సార్వభౌమత్యాన్ని అంగీకరించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది. ఫ్రీజ్‌ చేసిన ఆస్తులను విడుదల చేయాలని కోరింది. ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలో హర్మూజ్‌ జలసంధి దగ్గర అమెరికా నౌకలు రావడంపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌ అభ్యంతరం తరువాత అమెరికా నౌకలు వెళ్లిపోయాయి.

ఖతార్‌తో సహా వివిధ దేశాల్లో 11 లక్షల కోట్ల ఇరాన్‌ నిధులను ఫ్రీజ్‌ చేశారు. అయితే తమ డిమాండ్లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమ ఖాతాలను డీఫ్రీజ్‌ చేయాలన్నది ప్రధాన డిమాండ్‌ అని ఇరాన్‌ ప్రతినిధి బృందం చెబుతోంది. లెబనాన్‌తో సహా పశ్చిమాసియాలో కాల్పుల విరమణ అమలు చేయాలని ఇరాన్‌ డిమాండ్ చేసింది. యుద్ద నష్టపరిహారం చెల్లించాలని కోరింది.

అయితే ఇరాన్‌ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదని వైట్‌హౌస్‌ తేల్చిచెప్పింది. మా దగ్గర అందరికంటే ఎక్కువ ముడిచమురు, గ్యాస్‌ ఉందని, అన్ని దేశాల నుంచి నౌకలు తమ వైపు వస్తున్నాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌ విఫలదేశమని మండిపడ్డారు.

తొలుత ఇరాన్‌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ . తరువాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వం లోని ప్రతినిధి బృందంతో పాక్‌ ప్రధాని సమావేశమయ్యారు. ఇరాన్‌ ప్రతిపాదనలను అమెరికా ప్రతినిధి బృందానికి ఇచ్చారు షాబాజ్‌ షరీఫ్‌. తరువాత త్రైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.

అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్‌ ప్రతినిధి బృందానికి ఆ దేశ మొహమ్మద్‌ బాఘర్‌ ఘాలిబఫ్‌ నేతృత్వం వహిస్తున్నారు. 15 పాయింట్ల అజెండాతో ముందుకొచ్చింది అమెరికా. అంతకు మించిన పాయింట్లతో ఇరాన్‌ చర్చలకు రెడీ అయ్యింది. అణ్వాయుధాలు విడనాడాలి, జలసంధిని తెరవాలంటోంది అమెరికా

తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తేయాలని , హర్మూజ్‌ జలసంధిపై సార్వభౌమాధికారం కావాలంటోంది ఇరాన్‌. మిడిలీస్ట్‌ నుంచి అమెరికా బలగాలు వెనుదిరగాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రాక్సీ గ్రూపులను ఇరాన్‌ విడనాడాలంటూ అమెరికా కండిషన్‌ పెట్టింది. అంతేకాదు అమెరికా హార్మూజ్‌ జలసంధిని తెరవాలి అంటుంటే.. జలసంధిపై సార్వభౌమాధికారం ఇవ్వాలంటోంది ఇరాన్‌.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us