సీఈవో కుటుంబాన్ని నట్టేట ముంచిన నట్టు.. వీడియో

Updated on: Apr 20, 2025 | 12:04 PM

అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టీన్ ఎస్కోబార్ కుటుంబంతో సహా దుర్మరణం పాలయ్యారు. న్యూయార్క్ పర్యటనలో భాగంగా అగస్టీన్ భార్యాపిల్లలతో కలిసి హెలికాప్టర్ రైడ్ కు వెళ్లారు. అయితే, గాల్లోకి లేచిన కాసేపటికే రెక్కలు ఊడిపోయి హెలికాప్టర్ గిరగిరా తిరుగుతూ హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అగస్టీన్ తో పాటు ఆయన భార్యాపిల్లలు మరణించారు. ఈ దుర్ఘటనపై అధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. హెలికాప్టర్ ప్రమాదానికి జీసెస్ నట్టుగా వ్యవహరించే ఓ నట్టు కారణమని ప్రాథమికంగా తేలింది.

 నట్టు ఊడిపోవడం వల్లే రెక్కలు విడిపోయి హెలికాప్టర్ కూలిపోయిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే ముందు తప్పనిసరిగా ఈ నట్టును పరీక్షించాల్సి ఉండగా ప్రమాదం జరిగిన రోజు పైలట్ ఈ విషయాన్ని పట్టించుకోలేదని తేలింది. ఆ రోజు సదరు హెలికాప్టర్ సీమెన్స్ కుటుంబాన్ని రైడ్కు తీసుకెళ్లడానికి ముందు ఏడుసార్లు ప్రయాణించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ హెలికాప్టర్‌లో చాలా రిపేర్లు ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. గతేడాది ఆ హెలికాప్టర్ లో ట్రాన్స్‌మిషన్‌ సమస్య తలెత్తిందని ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు చెబుతున్నారు. మార్చి 1న ఇన్‌స్పెక్షన్‌ను పూర్తి చేసుకుందని వివరించారు. నిబంధనల ప్రకారం హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరే ప్రతిసారి ఆ నట్టును చెక్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రయాణానికి ముందు ఆ చెకింగ్‌ జరగలేదని సమాచారం. హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించిన రికార్డులు కూడా సదరు కంపెనీ సరిగా నిర్వహించడంలేదని అధికారుల విచారణలో తేలింది. హెలికాప్టర్ కు అవసరమైన మరమ్మతులు చేయించకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.